Wednesday, March 11, 2020

ధ్రువోపాఖ్యానము - 5

4-228-క.
"అనఘా! యీ దుఃఖమునకుఁ
బనిలే దన్యులకు సొలయ బలవంతంబై
తన పూర్వ జన్మ దుష్కృత
ఘనకర్మము వెంటనంటఁగా నెవ్వలనన్.
4-229-వ.
కావున.
4-230-క.
పెనిమిటి చేతను బెండ్లా
మని కాదు నికృష్టదాసి యనియును బిలువం
గను జాలని దుర్భగురా
లనఁగల నా కుక్షి నుదయ మందిన కతనన్.
4-231-క.
నిను నాడిన యా సురుచి వ
చనములు సత్యంబు లగును; సర్వశరణ్యుం
డనఁగల హరిచరణంబులు
గను జనకుని యంక మెక్కఁగాఁ దలఁతేనిన్.
4-232-వ.
కావునం బినతల్లి యైన యా సురుచి యాదేశంబున నధోక్షజు నాశ్రయింపుము" అని వెండియు నిట్లనియె.

భావము:
“నాయనా! మన దుఃఖానికి ఇతరులను అనవలసిన పని లేదు. పూర్వజన్మంలో చేసిన పాపం మానవులను వెంబడించి వస్తుంది. కనుక భర్తచేత భార్యగానే కాదు, దాసిగా కూడా పిలువబడని దురదృష్టవంతురాలినైన నా కడుపున పుట్టిన కారణంచేత నీకు అవమానం తప్పలేదు. నీ సవతి తల్లి సురుచి నీతో పలికిన మాటలు వాస్తవమే. నీకు తండ్రి ఒడిలో కూర్చోవాలనే ఆశ ఉన్నట్లయితే అందరికీ దిక్కు అయిన హరిపాదాలను ఆరాధించు. కనుక పినతల్లి ఐన ఆ సురిచి ఆజ్ఞను పాటించి విష్ణువును ఆశ్రయించు” అని తల్లి ఇంకా ఇలా అన్నది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=10&padyam=232

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: