Sunday, March 1, 2020

దక్ష యాగము - 49

(శివుడనుగ్రహించుట )

4-162-వ.
అని యిట్లు రుద్రక్షమాపణంబు గావించి పద్మసంభవుచేత ననుజ్ఞాతుండై దక్షుం డుపాధ్యాయ ఋత్విగ్గణ సమేతుం డగుచుఁ గ్రతుకర్మంబు నిర్వర్తించు సమయంబున, బ్రాహ్మణజనంబులు యజ్ఞంబులు నిర్విఘ్నంబులై సాగుటకుఁ బ్రమథాది వీర సంసర్గ కృత దోష నివృత్త్యర్థంబుగా విష్ణుదేవతాకంబును ద్రికపాలపురోడాశ ద్రవ్యకంబును నైన కర్మంబుఁ గావింప నధ్వర్యుకృత్య ప్రవిష్టుం డగు భృగువు తోడం గూడి నిర్మలాంతఃకరణుం డగుచు దక్షుఁడు ద్రవ్యత్యాగంబుఁ గావింపఁ బ్రసన్నుండై సర్వేశ్వరుండు.
4-163-సీ.
మానిత శ్యామాయమాన శరీర దీ;
ధితులు నల్దిక్కుల దీటుకొనఁగఁ
గాంచన మేఖలా కాంతులతోడఁ గౌ;
శేయ చేలద్యుతుల్ చెలిమి చేయ
లక్ష్మీసమాయుక్త లలిత వక్షంబున;
వైజయంతీ ప్రభల్ వన్నెచూప
హాటకరత్న కిరీట కోటిప్రభల్;
బాలార్క రుచులతో మేలమాడ
4-163.1-తే.
లలితనీలాభ్రరుచిఁ గుంతలములు దనరఁ
బ్రవిమలాత్మీయ దేహజప్రభ సరోజ
భవ భవామర ముఖ్యుల ప్రభలు మాప
నఖిలలోకైక గురుఁడు నారాయణుండు.

భావము:
అని ఈ విధంగా దక్షుడు క్షమింపుమని రుద్రుణ్ణి వేడుకున్నాడు. తరువాత బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించగా ఉపాధ్యాయులతోను, ఋత్విక్కులతోను కూడి యజ్ఞం చేయడం ప్రారంభించాడు. అప్పుడు బ్రాహ్మణులు యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగడానికి, ప్రమథ వీరుల సంబంధంవల్ల కలిగిన దోషం నివారించడానికి విష్ణుమూర్తి దేవతగా కలిగినదీ, పురోడాశ ద్రవ్యం కలిగినదీ అయిన కర్మను నిర్వర్తించారు. అధ్వర్యుకార్యాన్ని స్వీకరించిన భృగువుతో కూడి నిర్మలమైన మనస్సు కలవాడై దక్షుడు ద్రవ్యత్యాగం చేసాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు అనుగ్రహించి సాక్షాత్కరించాడు. నల్లని మేని కాంతులు నాలుగు దిక్కుల్లో వ్యాపిస్తుండగా, బంగారు మొలత్రాడు కాంతులతో పట్టుబట్టల కాంతులు కలిసిపోగా, లక్ష్మికి కాపురమైన వక్షఃస్థలంపై వైజయంతీమాల కాంతులను ప్రసరిస్తుండగా, రత్నాలు పొదిగిన బంగారు కిరీటం కాంతులు బాలసూర్యుని వెలుగులతో అతిశయించగా, శిరోజాలు నీలమేఘ కాంతులతో ఒప్పుతుండగా, తన దేహంనుండి వెలువడే దివ్యకాంతులు బ్రహ్మ, శివుడు మొదలైన దేవతాశ్రేష్ఠుల దేహకాంతులను క్రిందుపరుస్తూ సమస్త లోకాలకు గురువైన నారాయణుడు సాక్షాత్కరించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=163

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

No comments: