Monday, March 30, 2020

ధ్రువోపాఖ్యానము - 20


4-276-చ.
"హరి! పరమాత్మ! కేశవ! చరాచర భూతశరీర ధారివై
పరఁగుదు వీవు; నిట్టులుగఁ బ్రాణనిరోధ మెఱుంగ మెందు ముం
దిరవుగ దేవదేవ! జగదీశ్వర! సర్వశరణ్య! నీ పదాం
బురుహము లర్థిమై శరణు బొందెద మార్తి హరించి కావవే!"
4-277-వ.
అని దేవతలు విన్నవించిన నీశ్వరుండు వారల కిట్లనియె “ఉత్తానపాదుం డనువాని తనయుండు విశ్వరూపుండ నయిన నా యందుఁ దన చిత్తం బైక్యంబు చేసి తపంబు గావించుచుండ, దానంజేసి భవదీయ ప్రాణనిరోధం బయ్యె; అట్టి దురత్యయం బైన తపంబు నివర్తింపఁ జేసెద: వెఱవక మీమీ నివాసంబులకుం జనుం” డని యానతిచ్చిన నా దేవతలు నిర్భయాత్ములై యీశ్వరునకుఁ బ్రణామంబు లాచరించి త్రివిష్టపంబునకుం జనిరి; తదనంతరంబు.

భావము:
“శ్రీహరీ! పరమాత్మా! కేశవా! నీవు సర్వప్రాణి శరీరాలలో అంతర్యామిగా ఉండే స్వామివి. పూర్వం ఎప్పుడూ ఈ విధంగా మాకు ప్రాణనిరోధం ప్రాప్తించలేదు. ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాము. జగదీశ్వరా! సర్వశరణ్యా! నీ చరణ కమలాలను శరణు కోరుతున్నాము. ఆపదను తొలగించి కాపాడు.” అని దేవతలు విన్నవించగా శ్రీహరి వారితో ఇలా అన్నాడు. “ఉత్తానపాదుని కొడుకు విశ్వస్వరూపుణ్ణి అయిన నాయందు తన మనస్సును సంధానం చేసి తపస్సు చేస్తున్నాడు. అందువల్ల మీకు ప్రాణనిరోధం కలిగింది. ఆ బాలుణ్ణి తపస్సు నుండి విరమింప జేస్తాను. భయపడకండి. మీ మీ ఇండ్లకు వెళ్ళండి” అని ఆనతి నివ్వగా భయం తొలగిన దేవతలు వాసుదేవునకు నమస్కరించి తమ లోకాలకు బయలుదేరి వెళ్ళారు. ఆ తరువాత...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=277

: :  భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

No comments: