Tuesday, March 10, 2020

ధ్రువోపాఖ్యానము - 3


4-220-క.
అదిగాన నీ వధోక్షజు
పదపద్మము లాశ్రయింపు; పాయక హరి నా
యుదరమునఁ బుట్టఁ జేయును,
వదలక యట్లయిన ముదము వఱలెడి నీకున్."
4-221-క.
అని యీ రీతి నసహ్యవ
చనములు పినతల్లి యపుడు జనకుఁడు వినగాఁ
దను నాడిన దుర్భాషా
ఘనశరములు మనము నాఁటి కాఱియపెట్టన్.
4-222-క.
తను నట్లుపేక్ష చేసిన
జనకునికడఁ బాసి దుఃఖ జలనిధిలోనన్
మునుఁగుచును దండతాడిత
ఘనభుజగముఁబోలె రోషకలితుం డగుచున్,
4-223-క.
ఘన రోదనంబు చేయుచుఁ
గనుఁగవలను శోకబాష్ప కణములు దొరఁగన్
జనని కడ కేగుటయు నిజ
తనయునిఁ గని యా సునీతి దద్దయుఁ బ్రేమన్.

భావము:
కనుక ధ్రువకుమారా! నీవు విష్ణుదేవుని పాదపద్మాలను ఆశ్రయించు. ఆయన నిన్ను నా కడుపున పుట్టేటట్లు అనుగ్రహిస్తాడు. అప్పుడు నీ కోరిక నెరవేరుతుంది.” అని ఈ విధంగా తండ్రి వింటూ ఉండగా పినతల్లి సురుచి పలికిన వాక్యాలను ధ్రువుడు సహించలేకపోయాడు. ఆమె నిందావాక్యాలు బాణాలవలె అతని మనస్సులో నాటుకొని పీడించగా ఆ విధంగా తనను నిర్లక్ష్యం చేసిన తండ్రి దగ్గరనుండి దెబ్బ తిన్న పాములాగా రోషంతో, పట్టరాని దుఃఖంతో ధ్రువుడు తల్లి వద్దకు వచ్చాడు. బిగ్గరగా ఏడుస్తూ, కన్నులనుండి దుఃఖబాష్పాలు రాలుతూ ఉండగా కన్నతల్లిని సమీపించగా సునీతి కన్నకొడుకును చూచి మిక్కిలి ప్రేమతో....

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=10&padyam=222

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: