Tuesday, March 10, 2020

ధ్రువోపాఖ్యానము - 4

4-224-వ.
తొడలపై నిడుకొని.
4-225-క.
కర మనురక్తిని మోము ని
విరి తద్వృత్తాంత మెల్ల వెలఁదులు నంతః
పురవాసులుఁ జెప్పిన విని
పఱపుగ నిట్టూర్పు లెసఁగ బా ష్పాకుల యై.
4-226-తే.
సవతి యాడిన మాటలు సారెఁ దలఁచి
కొనుచుఁ బేర్చిన దుఃఖాగ్నిఁ గుందుచుండెఁ
దావపావక శిఖలచేఁ దగిలి కాంతి
వితతిఁ గందిన మాధవీలతికబోలె.
4-227-వ.
అంత నా సునీతి బాలునిం జూచి "తండ్రీ! దుఃఖింపకు" మని యిట్లనియె.

భావము:
తన తొడలపై కూర్చుండబెట్టుకొని ఎంతో గారాబంతో కొడుకు ముఖాన్ని నిమిరి, జరిగిన వృత్తాంతం అంతఃపుర కాంతలు చెప్పగా విని, నిట్టూర్పులు విడుస్తూ, కన్నీరు కార్చుతూ సవతి అయిన సురుచి తన కొడుకును అన్న మాటలను మాటిమాటికీ తలచుకొంటూ కార్చిచ్చు మంటల వేడికి కంది కళతప్పిన మాధవీలతలాగా శోకాగ్నితో కుమిలిపోయింది. అప్పుడు ఆ సునీతి తన కొడుకును చూచి “తండ్రీ! దుఃఖించకు” అంటూ ఇలా అన్నది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=10&padyam=225

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: