Sunday, August 8, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౦౩ (303)

( నారదుని ద్వారకాగమనంబు )

10.2-598-చ.
"నరవర! యొక్కనాఁడు విను నారదసంయమి మాధవుండు దా
నరకునిఁ ద్రుంచి వాని భవనంబున నున్న పదాఱువేల సుం
దరులను నొక్కమాటు ప్రమదంబున నందఱ కన్నిరూపులై
పరిణయ మయ్యె నా విని శుభస్థితిఁ దద్విభవంబుఁ జూడఁగన్.
10.2-599-వ.
ఇట్లు దలంచి కృష్ణపాలితంబయిన ద్వారకానగరంబు డాయంజని ముందట.
10.2-600-సీ.
శుక శారికా శిఖి పిక కూజిత ప్రస-
  వాంచితోద్యానవనౌఘములనుఁ
గలహంస సారస కైరవ కమల క-
  హ్లార శోభిత కమలాకరములఁ
గలమాది సస్య సంకుల వరేక్షుక్షేత్ర-
  భూరి లసన్నదీ తీరములను
గిరిసాను పతిత నిర్ఝరకణ సందోహ-
  సంతత హేమంతసమయములనుఁ
10.2-600.1-తే.
గమలసంభవ కాంచనకార రచిత
చిరతరైశ్వర్య నగరలక్ష్మీకరాబ్జ
ఘటిత నవరత్నమయ హేమకటక మనఁగ
సొబగుమీఱిన కోటయుఁ జూచె మౌని.

భావము:
“ఓ రాజశేఖరా! విను. శ్రీకృష్ణుడు నరకాసురుడిని చంపి, అతని మందిరంలో ఉన్న పదహారువేల మంది అందగత్తెలనూ వరించి, ఒకేమారు అందరికీ అన్ని రూపాలతో కనపడుతూ వివాహం చేసుకున్నాడు అనే వార్త నారదుడు విన్నాడు. ఒకనాడు ఆ కృష్ణవైభవం దర్శించాలనే కాంక్షతో ద్వారకకు వచ్చాడు. అప్పుడు అలా కృష్ణవైభవ దర్శనం కోసం నారదుడు ద్వారకలో ప్రవేశించి నప్పుడు. చిలుకలూ, గోరువంకలూ, నెమళ్ళూ, కోయిలలూ ఆనందంతో కలకలారావాలు చేస్తూ ఉన్న ఉద్యానవనాలను కనుగొన్నాడు. హంసలతోనూ, బెగ్గురపక్షులతోనూ, పద్మాలతోనూ, కలువలతోనూ శోభిస్తున్న సరస్సులను సందర్శించాడు. వరిపంటలతో కలకలలాడే క్షేత్రాలతోనూ చెరకుతోటలతోనూ కనువిందుచేసే నదీతీరాలను సందర్శించాడు. కొండచరియల నుంచి ఎడతెగకుండా జల్లులుగా పడుతున్న సెలయేటి నీటితుంపరల వలన సదా హేమంత ఋతువుగా అలరారుతున్న ప్రదేశాలనూ తిలకించాడు. భోగభాగ్యాలతో తులతూగే నగరలక్ష్మి తన చేతికి ధరించినదీ, బ్రహ్మతో సమానులైన స్వర్ణకారులు తయారుచేసినదీ అయిన నవరత్న ఖచిత బంగారు కంకణంలాగా ప్రకాశిస్తున్న కోటను చూసాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=50&Padyam=600

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: