Wednesday, August 4, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౦౦ (300)

( కాశీరాజు వధ )

10.2-532-తే.
అనిన నా చంద్రమౌళి వాక్యముల భంగి
భూరినియమముతో నభిచారహోమ
మొనరఁ గావింప నగ్ని యథోచితముగఁ
జెలఁగు దక్షిణవలమాన శిఖల వెలిఁగె.
10.2-533-వ.
అందుఁ దామ్రశ్మశ్రుకేశకలాపంబును, నశనిసంకాశంబులైన నిడుద కోఱలును, నిప్పులుప్పతిల్లు చూడ్కులును, ముడివడిన బొమలును, జేవురించిన మొగంబును గలిగి కృత్య యతి రౌద్రాకారంబునఁ బ్రజ్వరిల్లుచుఁ గుండంబు వెలువడి యనుదిన నిహన్య మాన ప్రాణిరక్తారుణ మృత్యుకరవాలంబు లీలం జూపట్టు నాలుకను సెలవుల నాకికొనుచు నగ్నికీలాభీలంబగు శూలంబు గేలం దాల్చి భువనకోలాహలంబుగా నార్చుచు, నుత్తాల తాలప్రమాణ పాదద్వయ హతులం దూలు పెంధూళి నింగిమ్రింగ, భూతంబులు సేవింప, నగ్నవేషయై, నిజవిలోచన సంజాత సముద్ధూత నిఖిల భయంకర జ్వాలికాజాలంబున దిశాజాలంబు నోలిం బ్రేల్చుచు, నుద్వేగగమనంబున నగధరు నగరంబున కరుగుదేరఁ, బౌరజనంబులు భయాకులమానసులై దావదహనునిం గని పఱచు వన మృగంబులచాడ్పునం బఱచి, సుధర్మాభ్యంతరంబున జూదమాడు దామోదరునిం గని “రక్షరక్షేతి”రవంబుల నార్తులయి “కృష్ణ! కృష్ణ! పెనుమంటలం బురంబు గాల్పం బ్రళయాగ్ని సనుదెంచె” నన వారిం జూచి “యోడకోడకుఁ” డని భయంబు నివారించి, సర్వరక్షకుండైన పుండరీకాక్షుండు జగదంతరాత్ముండు గావునం దద్వృత్తాంతం బంతయుఁ దన దివ్యచిత్తంబున నెఱింగి కాశీరాజపుత్త్ర ప్రేరితయైన యమ్మహాకృత్యను నిగ్రహింపం దలంచి నిజపార్శ్వవర్తి యయియున్న యద్దివ్యసాధనంబు గనుంగొని యప్పుడు.

భావము:
అలా చెప్పిన పరమేశ్వరుని వాక్యానుసారం సుదక్షిణుడు గొప్పనియమాలతో అభిచార హోమం చేసాడు. అగ్నిదేవుడు కుడి వైపుగా తిరుగుతూ జ్వలించే జ్వాలలతో వెలిగాడు. ఆ అభిచారహోమ గుండంలోని అగ్నిజ్వాలల నుండి ఎఱ్ఱని జుట్టూ; పిడుగుల వంటి కోరలూ; నిప్పులు గ్రక్కే చూపులూ; ముడిపడిన కనుబొమలూ; జేవురించిన ముఖము; కలిగిన “కృత్య” అతిభయంకర ఆకారంతో వెలువడింది. ఆ కృత్య మృత్యుదేవత కరవాలంలా కనిపిస్తున్న నాలుకతో పెదవి మూలలు తడవుకుంటూ, అగ్నిజ్వాలవంటి శూలాన్ని చేతబట్టి, లోకం దద్దరిల్లేలా బొబ్బలు పెడుతూ, నింగినిండా దుమ్ము వ్యాపించేలా తాటిచెట్ల వంటి పాదాలతో అడుగులు వేస్తూ, భూతాలు సేవిస్తుండగా, కళ్ళ నుంచి రాలే నిప్పులతో దిక్కులను కాల్చివేస్తూ, అతివేగంగా శ్రీకృష్ణుని ద్వారకా నగరానికి దిగంబరంగా వచ్చింది. ద్వారకానగరవాసులు అంతా కృత్యను చూచి దావానలాన్ని చూసి పారిపోయే అడవిజంతువుల లాగా పారిపోయి “కాపాడు కాపాడు” అని అరుస్తూ, సుధర్మా సభామండపంలో జూదమాడుతున్న దామోదరుడు, శ్రీకృష్ణుడిని చేరారు. “మన పట్టణాన్ని దహించడానికి ప్రళయకాలాగ్ని వచ్చింది. మమ్మల్ని రక్షించు” అని ప్రార్థించారు. వారికి “భయపడకండి” అని చెప్పి, పుండరీకముల వంటి కన్నులున్న వాడు, విశ్వము అంతటిలోనూ ఆత్మరూపంలో వ్యాపించి ఉండేవాడు, సర్వరక్షకుడు, అయిన శ్రీకృష్ణుడు జరిగిన సంగతంతా దివ్యదృష్టితో తెలిసికొని, కాశీ రాకుమారుడు పంపించిన కృత్యను సంహరించాలని భావించి తన చక్రాయుధాన్ని పరికించి......

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=45&Padyam=533

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: