Monday, August 2, 2021

శ్రీకృష్ణ విజయము - 298

( కాశీరాజు వధ )

10.2-527-సీ.
అక్కడఁ గాశిలో నా రాజు మందిరాం-
  గణమునఁ గుండల కలిత మగుచుఁ
బడి యున్న తలఁ జూచి పౌరజనంబులు-
  దమ రాజు తలయ కాఁ దగ నెఱింగి
చెప్పిన నా నృపు జీవితేశ్వరులును-
  సుతులు బంధువులును హితులు గూడి
మొనసి హాహాకారమున నేడ్చి; రత్తఱిఁ-
  దత్తనూభవుఁడు సుదక్షిణుండు
10.2-527.1-తే.
వెలయఁ దండ్రికిఁ బరలోకవిధు లొనర్చి
జనకు ననిలో వధించిన చక్రపాణి
నడరి మర్దింపఁ దగు నుపాయంబు దలఁచి
చతురుఁ డగు నట్టి తన పురోహితునిఁ బిలిచి.
10.2-528-క.
అతడుం దానునుఁ జని పశు
పతిపద సరసిజములకునుఁ బ్రమదముతో నా
నతుఁడై యద్దేవుని బహు
గతులం బూజింప నతఁడుఁ గరుణాన్వితుఁడై.

భావము:
ఇక అక్కడ కాశీపట్టణంలో ఆ రాజమందిరంలో, కుండల సహితమైన శిరస్సు పడగానే పురజనులు అందరూ అది తమ రాజు శిరస్సుగా గుర్తించారు. ఆ రాజు భార్యలు, పుత్రులు, మిత్రులు, బంధువులు హాహాకారాలు చేస్తూ దుఃఖించారు. కాశీరాజు కుమారుడు సుదక్షిణుడు తండ్రికి ఉత్తర క్రియలు నిర్వర్తించాడు. తన తండ్రిని యుద్ధంలో సంహరించిన శ్రీకృష్ణుడిని సంహరించడానికి ఉపాయం ఆలోచించాడు. చతురుడైన పురోహితుడిని పిలిపించి. పురోహితుడూ తానూ వెళ్ళి పరమేశ్వరుని పాదాలకు మ్రొక్కి, బహువిధాలుగా పూజలు చేసారు. పరమశివుడు కరుణామయుడు అయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=45&Padyam=527

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: