Friday, August 6, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౦౨ (302)

( కాశీరాజు వధ )

10.2-535-వ.
అదియును, బ్రళయవేళాసంభూత జీమూతసంఘాత ప్రభూత ఘుమఘుమాటోప నినదాధరీకృత మహాదుస్సహ కహకహ నిబిడనిస్వననిర్ఘోషపరిపూరిత బ్రహ్మాండకుహరంబును, నభ్రంలిహ కీలాసముత్కట పటు చిటపట స్ఫుట ద్విస్ఫులింగచ్ఛటాభీలంబును, సకలదేవతాగణ జయజయశబ్ద కలితంబును, ననంతతేజో విరాజితంబును నగుచుం గదిసినం బంటింపక కంటగించు కృత్యను గెంటి వెంటనంటిన నది తన తొంటిరౌద్రంబు విడిచి మరలి కాశీపురంబు సొచ్చి పౌరలోకంబు భయాకులతంబొంది వాపోవ, రోషభీషణాకారంబుతో నప్పుడు ఋత్విఙ్నికాయయుతంబుగ సుదక్షిణుని దహించె; నత్తఱిఁ జక్రంబును దన్నగరంబు సౌధ ప్రాకార గోపురాట్టాల కాది వివిధ వస్తు వాహన నికరంబుతో భస్మంబు గావించి మరలి యమరులు వెఱఁగందఁ గమలలోచన పార్శ్వవర్తి యై నిజ ప్రభాపుంజంబు వెలుఁగొందఁ గొల్చియుండె" నని చెప్పి; మఱియు నిట్లనియె.
10.2-536-క.
"మురరిపు విజయాంకితమగు
చరితము సద్భక్తిఁ దగిలి చదివిన వినినన్
దురితములఁ బాసి జను లిహ
పరసౌఖ్యము లతనిచేతఁ బడయుదు రధిపా!"
10.2-537-వ.
అనిన శుకయోగికి రాజయోగి యిట్లనియె.

భావము:
ఆ చక్రాయుధం ప్రళయకాలంనాటి మేఘాల నుండి పుట్టిన ఘుమ ఘుమ అంటూ భయంకరంగా ధ్వనించే గర్జనల వంటి ధ్వనితో, ఆకాశాన్ని అంటుతున్న అగ్నిజ్వాలలతో, అమిత తేజస్సుతో వెలుగొందుతూ, సకల దేవతలు జయజయ ధ్వానాలు చేస్తుండగా, కృత్యను సమీపించింది. తనను చూసి తడబడకుండా కంటగిస్తున్న కృత్యను గెంటివేసి, వెంటబడింది. అప్పుడు, కృత్య తన పూర్వపు రౌద్రరూపాన్ని వదలి తిరిగి కాశీపురం వచ్చింది. మరలి వచ్చిన కృత్యను చూసి పౌరులంతా భయపడి శోకిస్తుండగా, ఆ కృత్య రోషభీషణమైన ఆకారంతో ఋత్విజులతోపాటు సుదక్షిణుని దహించి వేసింది. అప్పుడు, శ్రీకృష్ణుడి చక్రాయుధం సౌధ, గోపుర, ప్రాకారాలతోపాటు ఆ నగరాన్ని భస్మీపటలం చేసింది. దేవతలంతా ఆశ్చర్యపడేలా శ్రీకృష్ణుడి వద్దకు తిరిగి వచ్చి చేరి, తన నిజప్రభావంతో ప్రకాశిస్తూ ఉంది.” అని శుకమహర్షి పరీక్షిన్మహారాజుతో చెప్పి కృష్ణగాథను ఇంకా ఇలా కొనసాగించాడు. “ఓ పరీక్షన్మహారాజా! శ్రీకృష్ణుడి ఈ విజయగాథలను భక్తితో చదివినవారు, వినినవారు పాపరహితులై, ఆ దేవుని దయచేత ఇహపర సౌఖ్యాలను పొందుతారు.” శుకయోగి ఇలా చెప్పగా రాజయోగి ఐన పరీక్షిత్తు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=45&Padyam=536

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: