Wednesday, July 28, 2021

శ్రీకృష్ణ విజయము - 293

( పౌండ్రకవాసుదేవుని వధ )

10.2-510-ఆ.
ఇంతనుండి యైన నెదిరిఁ దన్నెఱిఁగి నా
చిన్నెలెల్ల విడిచి చేరి కొలిచి
బ్రదుకు మనుము కాక పంతంబు లాడెనా
యెదురు మనుము ఘోర కదనమునను. "
10.2-511-క.
అను దుర్భాషలు సభ్యులు
విని యొండొరు మొగము సూచి విస్మితు లగుచున్
"జనులార! యెట్టి క్రొత్తలు
వినఁబడియెడు నిచట? లెస్స వింటిరె?" యనఁగన్.
10.2-512-వ.
అట్టియెడ కృష్ణుండు వాని కిట్లనియె.
10.2-513-మ.
"వినరా! మీ నృపుఁ డన్న చిహ్నములు నే వే వచ్చి ఘోరాజిలో
దనమీఁదన్ వెస వైవఁ గంకముఖగృధ్రవ్రాతముల్‌ మూఁగఁగా,
ననిలో దర్పము దూలి కూలి వికలంబై సారమేయాళికి
న్ననయంబున్ నశనంబ వయ్యె దను మే నన్నట్లుగా వానితోన్. "

భావము:
నీ శక్తి ఎదుటివారిశక్తి ఇక నుంచి అయినా తెలుసుకుని, నా చిహ్నాలు అన్నింటినీ వదలిపెట్టి నాకు సేవకుడవై బ్రతుకు. కాదు పంతానికి పోతాను అంటావా. యుద్ధానికి సిద్ధపడు.” ఇలా పలికిన దూత దుర్భాషలను సభ్యులంతా విని ఒకరి ముఖం మరొకరు చూచుకుంటూ ఆశ్చర్యపోయారు. “ఈవేళ ఎంత విచిత్రపు మాటలు విన్నాము.” అని అనుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు ప్రౌండ్రకుడి దూతతో ఇలా అన్నాడు. “ఓరీ! సరిగా విను. మీ రాజు ఏ చిహ్నాలను ధరించాను అని నన్ను గురించి చెప్పాడో; అవే చిహ్నాలను రేపు బయలుదేరి వచ్చి తొందరలోనే ఘోరయుద్ధంలో అతని మీద ప్రయోగిస్తాను. యుద్ధంలో శక్తి కోల్పోయి కూలి వికలం అయిపోయిన నిన్ను గ్రద్దలూ రాబందులూ చుట్టుముట్టుతా యని; కుక్కల గుంపులు నిన్ను చీల్చుకొని తింటా యనీ; మేము చెప్పినట్లుగా అతనికి చెప్పు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=44&Padyam=513

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: