Friday, July 23, 2021

శ్రీకృష్ణ విజయము - 289

( నృగుడు యూసరవిల్లగుట )

10.2-477-ఆ.
"కృష్ణ! వాసుదేవ! కేశవ! పరమాత్మ!
యప్రమేయ! వరద! హరి! ముకుంద!
నిన్నుఁ జూడఁ గంటి, నీ కృపం గనుగొంటి
నఖిల సౌఖ్యపదవు లందఁ గంటి. "
10.2-478-వ.
అని యనేకభంగులం గొనియాడి గోవిందుని పదంబులు దన కిరీటంబు సోఁకం బ్రణమిల్లి “దేవా! భవదీయ పాదారవిందంబులు నా హృదయారవిందంబును బాయకుండునట్లుగాఁ బ్రసాదింపవే?” యని తదనుజ్ఞాతుండై యచ్చటి జనంబులు సూచి యద్భుతానందంబులం బొంద నతుల తేజోవిరాజిత దివ్యవిమానారూఢుండై దివంబున కరిగె; నంత నమ్మాధవుండు నచ్చట నున్న పార్థివోత్తములకు ధర్మబోధంబుగా నిట్లనియె.

భావము:
“శ్రీకృష్ణా! వాసుదేవా! కేశవా! పరమాత్మా! అప్రమేయా! వరదా! హరీ! ముకుందా! నిన్ను దర్శించగలిగాను. నీ కృపను పొందగలిగాను. సమస్త సౌఖ్య పదవులను అందుకోగలిగాను.” ఇలా అనేక విధాలుగా స్తుతించి ఆ నృగుడు గోపాల ప్రభువు శ్రీకృష్ణుడి చరణారవిందాలకు నమస్కరించాడు. “దేవా! నీ పాదపద్మాలు నా హృదయ పద్మ మందు స్థిరపడునట్లు అనుగ్రహింపుము.” అని ప్రార్థించాడు. శ్రీకృష్ణుని అనుజ్ఞ గైకొని అక్కడ చేరిన వారందరూ ఆశ్చర్యానందాలు పొందుతుండగా నృగమహారాజు ఒక దివ్యవిమానాన్ని ఎక్కి స్వర్గానికి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు అక్కడ ఉన్న రాకుమార శ్రేష్ఠులకు ఇలా ధర్మబోధ గావించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=41&Padyam=478

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: