Thursday, July 1, 2021

శ్రీకృష్ణ విజయము - 270

( ప్రద్యుమ్న వివాహంబు )

10.2-281-సీ.
నావుడు శుకయోగి "నరనాయకోత్తమ!-
  నీవు చెప్పిన యట్ల నెమ్మనమునఁ
బద్మాయతాక్షుచేఁ బడిన బన్నమునకుఁ-
  గనలుచు నుండియు ననుజతోడి
నెయ్యంబునను భాగినేయున కిచ్చెను-
  గూఁతు నంచితపుష్ప కోమలాంగిఁ
దన పూన్కి దప్పినఁ దగ విదర్భేశుండు-
  విను మెఱింగింతు న వ్విధము దెలియఁ
10.2-281.1-తే.
బరఁగ రుక్మవతీ స్వయంవరమున కొగి
నరుగుదెం డని భీష్మభూవరసుతుండు
వరుస రప్పించె రాజన్యవర కుమార
వరుల నను వార్త కలరి యా హరిసుతుండు.
10.2-282-చ.
వర మణిభూషణప్రభలవర్గ మనర్గళ భంగిఁ బర్వఁ బ్ర
స్ఫురిత రథాధిరోహణవిభూతి దలిర్ప మనోహరైక సు
స్థిరశుభలీల నేగె యదుసింహకిశోరము రాజకన్యకా
పరిణయవైభవాగత నృపాలక కోటికి రుక్మివీటికిన్.

భావము:
ఇలా అడిగిన పరీక్షిత్తు మహారాజుతో శుకముని ఇలా చెప్పనారంభించాడు “ఓ రాజేంద్రా! నీవు అన్నట్లుగానే రుక్మి శ్రీకృష్ణుని వలన పొందిన అవమానానికి మనసులో బాధపడుతూనే వున్నాడు. అయినా తాను చేసిన ప్రయత్నం ఫలించకపోగా ఆ విదర్భరాజు తన చెల్లెలిపై గల అభిమానంతో తన మేనల్లుడికి కుసుమ కోమలయైన తన కుమార్తెను ఇచ్చాడు. అ విషయం తెలియజేస్తాను, విను. రుక్మి తన కుమార్తె అయిన రుక్మవతి స్వయంవరానికి రాజకుమారులను అందరినీ ఆహ్వానించాడు. ఆ వార్త విని కృష్ణనందనుడు ప్రద్యుమ్నుడు సంతోషించాడు. మహోజ్వల మణిభూషణాలకాంతులతో శోభిస్తూ రమణీయమైన రథాన్ని ఎక్కి మనోహర సౌందర్య విలాసాలతో యదుకుల సింహకిశోరం ప్రద్యుమ్నుడు రుక్మవతిని వివాహమాడాలనే కోరికతో మేనమామ పట్టణం కుండిననగరం వెళ్ళాడు. అప్పటికే స్వయంవరానికి రాజులందరూ విచ్చేసి ఉన్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=29&Padyam=281

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: