Tuesday, July 27, 2021

శ్రీకృష్ణ విజయము - 292

( పౌండ్రకవాసుదేవుని వధ )

10.2-508-సీ.
"మనుజేశ బలగర్వమున మదోన్మత్తుఁడై-
  యవనిపై వాసుదేవాఖ్యుఁ డనఁగ
నే నొక్కరుఁడ గాక యితరుల కీ నామ-
  మలవడునే?"యని "యదటు మిగిలి
తెగి హరిదా వాసుదేవుఁ డననుకొను-
  నఁట! పోయి వల దను"మనుచు దూతఁ
బద్మాయతాక్షుని పాలికిఁ బొమ్మన-
  నరిగి వాఁ డంబుజోదరుఁడు పెద్ద
10.2-508.1-తే.
కొలువుఁ గైకొని యుండ సంకోచపడక
"వినుము; మా రాజుమాటగా వనజనాభ!
యవని రక్షింప వాసుదేవాఖ్య నొంది
నట్టి యేనుండ సిగ్గు వోఁ దట్టి నీవు.
10.2-509-క.
నా పేరును నా చిహ్నము
లేపున ధరియించి తిరిగె దిది పంతమె? యిం
తే పో! మదిఁ బరికించిన
నే పంత మెఱుంగు గొల్లఁ డేమిట నైనన్?

భావము:
“భూలోకంలో వాసుదేవుడు అనే పేరు నాకు ఒక్కడికే చెల్లుతుంది. ఇతరులకు ఏమాత్రం చెల్లదు. కృష్ణుడు రాజ్యం పెద్ద సైన్యం కలిగాయనే గర్వంతో పొగరెక్కి వాసుదేవుడనని అనుకుంటున్నాడుట. పోయి వద్దని చెప్పు” అని బలగర్వంతో మదోన్మత్తుడై, కమలాల వంటి కన్నులు ఉన్న శ్రీకృష్ణుడి దగ్గరకు పౌండ్రకుడు ఆ దూతను పంపించాడు. వాడు వెళ్ళి శ్రీకృష్ణుడు సభతీర్చి ఉండగా సంకోచం లేకుండా ఇలా అన్నాడు “ఓ శ్రీకృష్ణా! మా రాజు చెప్పిన మాటలు విను. ‘భూమిని రక్షించడానికి వాసుదేవుడనే పేరు నాకుండగా, నీవు సిగ్గు విడిచి ఆ పేరు పెట్టుకున్నావు. నా పేరూ, నా చిహ్నాలూ ధరించి సంచరిస్తున్నావు. ఇది నీ పంతమా? ఐనా గోవులకాచుకునే గోపాలుడికి పంతమేమిటి?

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=44&Padyam=508

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: