Sunday, July 11, 2021

శ్రీకృష్ణ విజయము - 279

( రుక్మిబలరాముల జూదంబు )

10.2-306-క.
పరమానురాగరస సం
భరితాంతఃకరణు లగుచుఁ బాటించి వధూ
వరులను రథమం దిడి హల
ధర హరి రుక్మిణులఁ గొల్చి తగ యదువీరుల్‌.
10.2-307-ఉ.
మంగళతూర్యఘోషము లమందగతిం జెలఁగంగ మత్త మా
తంగ తురంగ సద్భట కదంబముతోఁ జని కాంచి రంత నా
రంగ లవంగ లుంగ విచరన్మదభృంగ సురంగనాద స
త్సంగ తరంగిణీకలిత సంతతనిర్మల నా కుశస్థలిన్.
10.2-308-వ.
ఇట్లు పురోపవనోపకంఠంబునకుం జని.

భావము:
యాదవవీరులు అనురాగమయ హృదయులై, వధూవరులను రథం మీద ఎక్కించుకుని బలరాముడు, కృష్ణుడు, రుక్మిణిలతో పాటు తమ రాజ్యానికి బయలుదేరారు. మంగళవాద్య ధ్వనులు మ్రోగుతుండగా; మదగజ, తురగ, రథ, సుభటులతో కూడిన చతురంగబలాలతో బయలుదేరి, వికసించిన నానావిధ వృక్షాలతో ఝుంకారంచేసే తుమ్మెదలతో స్వచ్ఛమైన తరంగాలతో ఎడతెగక పారే నదులతో కూడిన కుశలమైన ప్రాంతం కావున కుశస్థలి అని పేరుపొందిన ద్వారకానగరం చేరారు. అలా ద్వారకానగర పొలిమేర దాపునకు చేరి.....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=30&Padyam=307

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: