Sunday, July 11, 2021

శ్రీకృష్ణ విజయము - 278

( రుక్మిబలరాముల జూదంబు )

10.2-301-క.
మును దంతపంక్తి వెలిగాఁ
దను నవ్విన యక్కళింగుఁ దల వట్టి రయం
బునఁ బడఁదిగిచి వదన మే
పునఁ బెడచే వ్రేసి దంతములు వెస డులిచెన్.
10.2-302-క.
అంతం బోవక రుక్మిని
దంతంబులు మున్ను డులిచి తను వగలింప
న్నంతకుపురి కేగెను వాఁ
డెంతయు భయ మంది రాజు లెల్లం గలఁగన్.
10.2-303-వ.
అట్లుచేసి యయ్యాదవసింహం బసహ్యవిక్రమంబునం జెలంగె నంత.
10.2-304-క.
భూవర! పద్మాక్షుఁడు దన
బావ హతుం డగుట గనియుఁ బలుకక యుండెన్
భావమున రుక్మిణీ బల
దేవుల కే మనఁగ నెగ్గు దేఱునొ? యనుచున్.
10.2-305-వ.
అంత నా విదర్భానగరంబు నిర్గమించి.

భావము:
ఇంతకు ముందు తనను చూసి పండ్లికిలించి నవ్విన ఆ కళింగుడి తలపట్టుకుని క్రిందపడత్రోసి ఎడమచేతితో నోటి మీద గుద్ది పండ్లు ఊడగొట్టాడు. బలభద్రుడు అంతటితో ఊరుకోకుండా రాజులంతా భయపడేలా రుక్మి పండ్లు పగుల గొట్టి, గట్టిగా కొట్టాడు. దానితో వాడు మరణించాడు. ఈ విధంగా యదుసింహుడు బలరాముడు భయంకరమైన పరాక్రమంతో చెలరేగాడు. ఓ పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుడు తన బావమరది మరణాన్ని చూసి కూడా ఏమాటంటే రుక్మిణీ బలరాములు ఏమనుకుంటారోనని మౌనం వహించాడు. అంతట, యదువీరులు విదర్భానగరం వదలిపెట్టారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=30&Padyam=304

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: