Wednesday, July 7, 2021

శ్రీకృష్ణ విజయము - 276

( రుక్మిబలరాముల జూదంబు )

10.2-296-ఉ.
ఆడిన యాట లెల్లను హలాయుధుఁ డోడిన రుక్మి గెల్చుడున్
దోడి నృపాల కోటి పరితోషముఁ జెందఁ గళింగభూవిభుం
"డోడె బలుం" డటంచుఁ బ్రహసోక్తుల నెంతయు రాముఁ జుల్కఁగా
నాడెను దంతపంక్తి వెలి యై కనుపట్టఁగఁ జాల నవ్వుచున్.
10.2-297-తే.
బలుఁడు కోపించి యొక లక్ష పణము సేసి
యాడి ప్రకటంబుగా జూద మపుడు గెల్చె;
గెల్చి నను రుక్మి "యిది యేను గెల్చియుండ
గెలుపు నీ దని కికురింప నలవి యగునె?"
10.2-298-క.
అనవుడు హలధరుఁ డచ్చటి
జనపాలకసుతులఁ జూచి "సత్యము పలుకుం"
డని యడిగిన వారలు రు
క్ముని హితులై పలుక రైరి మొగమోటమునన్.
10.2-299-ఉ.
అప్పటి యట్ల యొడ్డి ముసలాయుధుఁ డేపున నాడి జూదముం
జొప్పఁడ గెల్చి "యీ గెలుపు సూడగ నాదియొ వానిదో జనుల్‌
తప్పక చెప్పుఁ" డన్న విదితధ్వనితో నశరీరవాణి తా
నిప్పటియాట రాముఁడె జయించె విదర్భుఁడె యోడె నావుడున్.

భావము:
ఆడిన ప్రతీ ఆటలో బలరాముడు ఓడిపోయాడు. రుక్మి గెలిచాడు. అక్కడి రాజు లందరికీ సంతోషం కలిగేలా, కళింగరాజు “బలరాముడు ఓడిపోయా” డని ఎగతాళి చేస్తూ పండ్లు బయటపడేలా ఇకిలించాడు. అప్పుడు బలరాముడికి కోపం వచ్చింది. ఒక లక్ష పందెంకాసి బలరాముడు రుక్మిపై విజయం సాధించాడు. బలరాముడు గెలిచినప్పటికీ, రుక్మి “విజయం నాదైతే, నువ్వే గెలిచానని చెప్పి మోసపుచ్చడం తగదు.” అని ఎదురుతిరిగాడు. అప్పుడు బలరాముడు అక్కడ చేరిన రాజులను అందరిని చూసి “నిజం చెప్పం” డని అడిగాడు. వారు రుక్మి మీది పక్షపాతం వలన మొహమాటంతో మౌనం వహించారు. బలరాముడు మళ్ళీ మరో ఆట ఆడి గెలిచాడు. “ఇప్పటి విజయం నాదా లేక ఇతనిదా చెప్పండి” అని అక్కడి వారిని మరల ప్రశ్నించాడు. ఆ సమయంలో అశరీరవాణి “ఈ ఆటలో బలరాముడే గెల్చాడు. విదర్భరాజు రుక్మి ఓడిపోయాడు” అని స్పష్టంగా తెలిపింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=30&Padyam=299

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: