Saturday, July 17, 2021

శ్రీకృష్ణ విజయము - 285

( నృగోపాఖ్యానంబు )

10.2-466-క.
అనఘా! మునుపడఁ గశ్యపుఁ
డను విప్రున కే నకల్మషాత్ముఁడనై యి
చ్చిన గోవు దప్పి నా మం
దను గలసినఁ దెలియలేక తగ నా గోవున్.
10.2-467-క.
ఒండొక భూమీసురకుల
మండనునకు దాన మీయ మసలక యా వి
ప్రుం డా గోవుంగొని చను
చుండన్ మును ధారగొన్న యుర్వీసురుఁడున్.
10.2-468-క.
మది రోష మొదవ దోవతి
వదలిన బిగియించుకొనుచు వడిఁ గది "సిది నా
మొదవు; నడివీథి దొంగిలి
వదలక కొనిపోయె; దిట్టివారుం గలరే? "

భావము:
ఓ పుణ్యపురుషా! అంతకు ముందు నేను కశ్యపుడనే విప్రుడికి పవిత్ర హృదయంతో దానముగా ఇచ్చిన గోవు తప్పిపోయి తిరిగివచ్చి నా ఆలమందలో కలసిపోయింది. ఆ విషయం తెలియక, నేను ఆ గోవును ఇంకొక బ్రాహ్మణోత్తమునకు దానముగా ఇచ్చాను. ఆ బ్రాహ్మణోత్తముడు ఆ ఆవును తోలుకుని వెళుతూంటే, ఇంతకు ముందు నాచే దానం పొందిన కశ్యపుడు ఆ గోవును చూసాడు. అలా చూసిన కశ్యపుడు,మిక్కిలి రోషంతో ఊడిపోతున్న దోవతి బిగించి, ఆవును తోలుకుని వెళ్ళే బ్రాహ్మణుని దగ్గరకు వేగంగా వెళ్ళి “ఇది నా ఆవు. దానిని దొంగిలించి నడివీధిలో తోలుకుని పోతున్నావు. ఇటువంటి వారు ఎక్కడైనా ఉంటారా.” అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=40&Padyam=468

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: