Thursday, July 15, 2021

శ్రీకృష్ణ విజయము - 283

( నృగోపాఖ్యానంబు )

10.2-459-క.
అని యడిగిన మురరిపు పద
వనజంబులఁ దన కిరీటవరమణు లొరయన్
వినయమున మ్రొక్కి యిట్లను
ఘనమోదముతోడ నిటల ఘటితాంజలియై.
10.2-460-తే.
"విశ్వసంవేద్య! మహిత! యీ విశ్వమందుఁ
బ్రకటముగ నీ వెఱుంగని దొకటి గలదె
యైన నాచేత విన నిష్ఠమయ్యె నేని
నవధరింపుము వినిపింతు నంబుజాక్ష!
10.2-461-శా.
ఏ నిక్ష్వాకుతనూజుఁడన్ నృగుఁడు నా నేపారు భూపాలుఁడన్;
దీనవ్రాతము నర్థిఁ బ్రోచుచు ధరిత్రీనాయకుల్‌ గొల్చి స
మ్మానింపం జతురంత భూభరణసామర్థ్యుండనై సంతత
శ్రీ నిండారినవాఁడ నుల్లసిత కీర్తిస్ఫూర్తి శోభిల్లఁగన్.

భావము:
అని శ్రీకృష్ణుడు అడుగడంతో ఆ పురుషుడు మురారి పాదపద్మాలకు తన కిరీటం మణులు సోకేలా నమస్కరించి, తన నుదుట చేతులు మోడ్చి, ఆనందంతో ఇలా విన్నవించాడు. “ఓ విశ్వవేద్యా! మహానుభావ! నీవు సర్వజ్ఞుడవు. ఈ ప్రపంచంలో నీకు తెలియని విషయం ఏదీ లేదు. అయినా, నా ద్వారా వినాలని భావించావు గనుక, అలాగే చెప్తాను. నేను ఇక్ష్వాకుని పుత్రుడను. నా పేరు నృగుడు. నేను రాజులు అనేకులు నన్ను సేవిస్తుండగా బహు సమర్థవంతంగా రాజ్యపాలన సాగించాను. దీనులను పోషించాను. పెంపొందిన అనంత కీర్తిసంపదలతో శోభించాను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=40&Padyam=461

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: