Friday, July 9, 2021

శ్రీకృష్ణ విజయము - 277

( రుక్మిబలరాముల జూదంబు )

10.2-300-వ.
అనిన విని సకలజనంబులు నద్భుతానందనిమగ్న మానసులైరి; కుటిలస్వభావులయిన భూవరులు రుక్మిం గైకొల్పిన నతండు తన తొల్లింటి పరాభవము దలంచి యెదిరిందన్ను నెఱుంగక బలాబల వివేకంబు సేయనేరక విధివశానుగతుండై చలంబున బలునిం గని "యిప్పటి యాటయు నేన గెల్చియుండ వృథాజల్పకల్పనుండ వయి ‘గెల్చితి’ నని పల్కెద; వక్షవిద్యా నైపుణ్యంబు గల భూపకుమారులతోఁ బసులకాపరు లెత్తువత్తురే" యని క్రొవ్వున నవ్వుచుం బలికిన, నప్పలుకులు సెవులకు ములుకుల క్రియం దాఁకినఁ గోపోద్దీపితమానసుండై పెటపెటం బండ్లుగొఱకుచుం గన్నులనిప్పు లుప్పతిల్లం గినుకం దోఁకత్రొక్కిన మహోరగంబు నోజ రోఁజుచు దండతాడితంబయిన పుండరీకంబులీల హుమ్మని మ్రోయుచుఁ బ్రచండ బాహుదండంబులు సాఁచి పరిఘం బందుకొని పరిపంథి యైన రుక్మిని నతని కనుకూలంబయిన రాజలోకంబును బడలుపడ నడిచె; నయ్యవసరంబున.

భావము:
ఆ మాటలువిని అక్కడి జనులంతా ఆనందించారు. కానీ కొందరు దుష్ట రాజులు ప్రేరేపించగా, రుక్మి పూర్వం జరిగిన పరాభవాన్ని జ్ఞప్తికి తెచ్చుకుని, బలాబలాలు తెలుసుకోలేక, విధివశాన బలరాముడిని చూసి పట్టుదలగా ఇలా అన్నాడు “ఈ ఆట గూడా నేనే గెల్చాను. వ్యర్థ ప్రలాపాలతో నేనే గెల్చానని చెప్పుకుంటున్నావు. జూదంలో ప్రావీణ్యం కల రాజకుమారులతో పశుల కాపరులు జూదమాడి గెలవగలరా?” అని అహంకారంతో నవ్వుతూ అవహేళన చేసాడు. ఈ పలుకులు బలరాముడి చెవులకు ములుకులుగా తగిలాయి. దానితో ఆయన కోపంగా పండ్లు పటపటా కొరుకుతూ, తోకత్రొక్కిన త్రాచులాగా బుసలుకొడుతూ, కఱ్ఱదెబ్బ తగిలిన పెద్దపులివలె గాండ్రించి, ఒక ఇనుపగుదియను తన చేతిలోకి తీసుకుని రుక్మినీ అతని పక్షం వారయిన రాజలు అందరినీ చావచితకబాదాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=30&Padyam=300

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: