Tuesday, July 13, 2021

శ్రీకృష్ణ విజయము - 281

( నృగోపాఖ్యానంబు )

10.2-454-సీ.
"ధరణీశ! యొకనాఁడు హరి తనూజులు రతీ-
  శ్వర సాంబ సారణ చారుభాను
లాదిగా యదుకుమారావలి యుద్యాన,-
  వనమున కతివైభవమున నేగి
వలనొప్ప నిచ్ఛానువర్తులై సుఖలీలఁ-
  జరియించి ఘనపిపాసలనుఁ జెంది
నెఱిదప్పి సలిల మన్వేషించుచును వేగ-
  వచ్చుచో నొకచోట వారిరహిత
10.2-454.1-తే.
కూపమును నందులో నొక కొండవోలె
విపుల మగు మేని యూసరవెల్లిఁ గాంచి
చిత్తముల విస్మయం బంది తత్తఱమున
దాని వెడలించు వేడుక దగులుటయును.
10.2-455-చ.
పరువిడి పోయి తెచ్చి ఘనపాశచయంబుల నంటఁగట్టి య
గ్గురుభుజు లందఱుంగదిసి కోయని యార్చుచు దాని నెమ్మెయిం
దరలఁగఁ దీయలేక దగ దట్టముగా మది దుట్టగిల్ల నొం
డొరు గడవంగ వే చని పయోరుహనాభున కంతఁ జెప్పినన్.

భావము:
ఓ పరీక్షన్మహారాజా! ఒకనాడు శ్రీకృష్ణుడి కుమారులు ఐన ప్రద్యుమ్నుడు, సాంబుడు, సారణుడు, చారుభానుడు మొదలైన యాదవ కుమారులు మిక్కిలి వైభవంగా ఉద్యానవనానికి వెళ్ళారు. స్వేచ్ఛగా ఆ ఉద్యానవనంలో విహరించి అలసిపోయారు. దాహం తీర్చుకోవడానికి నీటి కోసం వెదికారు. ఒకచోట, వారికి ఒక నీరు లేని పాడుబడ్డ బావి కనిపించింది. దానిలో ఉన్న పెద్దగా కొండంత ఉన్న ఊసరవెల్లిని చూసి, వారందరూ ఆశ్చర్యపోయారు. ఆ ఊసరవెల్లిని బావిలో నుంచి బయటకు తీయాలని అనుకున్నారు. వారంతా పరుగు పరగున వెళ్ళి, పెద్ద పెద్ద తాళ్ళు తీసుకుని వచ్చారు. గొప్ప భుజబలం కల ఆ వీరులు ఆ ఊసరవెల్లిని బయటకు తీయడానికి ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. వారు వెంటనే వెళ్ళి శ్రీకృష్ణుడితో ఈ విషయం విన్నవించారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=40&Padyam=455

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: