Thursday, July 15, 2021

శ్రీకృష్ణ విజయము - 282

( నృగోపాఖ్యానంబు )

10.2-456-ఉ.
విని సరసీరుహాక్షుఁ డతివిస్మితుఁడై జలశూన్యకూప మ
ల్లన కదియంగ నేఁగి కృకలాసము నొక్కతృణంబుఁ బోలె గొ
బ్బు న వెడలించె వామకరపద్మమున న్నది యంతలోనఁ గాం
చనరుచి మేనఁ గల్గు పురుషత్వముతోఁ బొడసూపి నిల్చినన్.
10.2-457-వ.
చూచి కృష్ణుం డతని వృత్తాంతం బంతయు నెఱింగియు నక్కడి జనంబులుం గుమారవర్గంబును దెలియుకొఱకు నతనిచేత తద్వృత్తాంతం బంతయు నెఱింగించువాఁడై యిట్లనియె.
10.2-458-చ.
"కన దురు రత్నభూషణ నికాయుఁడవై మహనీయమూర్తివై
యనుపమకీర్తిశోభితుఁడవై విలసిల్లుచు ధాత్రిమీఁదఁ బెం
పొనరిన నీకు నేమిగతి నూసరవెల్లితనంబు చొప్పడెన్
విన నిది చోద్య మయ్యె సువివేకచరిత్ర! యెఱుంగఁ జెప్పుమా! "

భావము:
పద్మాక్షుడు ఈ విషయం విని ఆశ్చర్యపడి, ఆ నీరులేని బావి దగ్గరకు వచ్చి, తన ఎడమచేతితో ఆ ఊసరవెల్లిని ఒక గడ్డిపరకను తీసినంత అవలీలగా బయటకు తీసాడు. అంతలో ఆ ఊసరవెల్లి బంగారురంగుతో శోభిల్లే పురుష రూపాన్ని పొందింది. అతనిని చూచి శ్రీకృష్ణుడు అతని వృత్తాంతం తనకు తెలిసినా కూడా, తన కుమారులకూ మిగిలిన జనాలకు తెలియడం కోసం. అతని కథను అతని చేతనే చెప్పించాలి అనుకుని అతనితో ఇలా అన్నాడు. “ఓ విచిత్ర చరిత్రుడా! చాలా విచిత్రంగా ఉంది. రత్నభూషణాలను ధరించి అసమానమైన కీర్తిని గడించి మహనీయమూర్తివై భూలోకంలో విలసిల్లే నీకు ఊసరవెల్లి రూపం ఎలా కలిగింది. నీ వృత్తాంతం అంతా మాకు వివరంగా చెప్పు”.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=40&Padyam=458

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: