Friday, July 23, 2021

శ్రీకృష్ణ విజయము - 290

( నృగుడు యూసరవిల్లగుట )

10.2-479-సీ.
"నరనాథకుల కాననము దహించుటకును-
  నవనీసురులవిత్త మగ్నికీల;
జననాయకుల నిజైశ్వర్యాబ్ధి నింకింప-
  బ్రాహ్మణక్షేత్రంబు బాడబంబు;
పార్థివోత్తముల సంపచ్ఛైలములఁ గూల్ప-
  భూసురధనము దంభోళిధార;
జగతీవరుల కీర్తి చంద్రిక మాప వి-
  ప్రోత్తము ధనము సూర్యోదయంబు;
10.2-479.1-తే.
విప్రతతి సొమ్ముకంటెను విషము మేలు
గరళమునకును బ్రతికృతి గలదు గాని
దాని మాన్పంగ భువి నౌషధములు లేవు
గాన బ్రహ్మస్వములు గొంట గాదు పతికి.
10.2-480-క.
ఎఱుఁగమి నైనను భూసుర
వరులధనం బపహరింప వలవదు పతికిన్;
మఱపున ననలము ముట్టిన
దరికొని వెసఁ గాల్పకున్నె తను వెరియంగన్?

భావము:
రాజవంశం అనే అడవిని దహించే అగ్నిజ్వాల బ్రాహ్మణుల ధనం; జగపతుల ఐశ్వర్యం అనే సముద్రాన్ని ఇంకించే బడబానలం విప్రక్షేత్రం; నరనాథుల సంపద అనే పర్వతాలకు భూసురుల ధనం వజ్రాయుధం; భూపతుల కీర్తి అనే వెన్నెలను తొలగించే సూర్యోదయం విప్రుల సంపద; బ్రాహ్మణుల ధనం కంటే విషం మేలు; విషానికి విరుగుడు ఉన్నది కానీ, బ్రాహ్మణ ధనాపహరణ వలన ప్రాప్తించే పాపానికి ప్రాయశ్చిత్తం లేదు; అందుచేత, క్షత్రియులు బ్రాహ్మణుల ధనాన్ని అపహరించడం మంచిది కాదు. తెలిసి కాని, తెలియక కాని, విప్రుల సొమ్ము రాజు అపహరించ రాదు, తెలియక అగ్నిని ముట్టుకున్నా, శరీరం బొబ్బలెక్కి బాధపెడుతుంది తప్ప, ఆ అగ్ని దహించకుండా ఉండదు కదా.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=41&Padyam=480

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: