Friday, November 5, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౮౭(387)

( శిశుపాలుని వధించుట ) 

10.2-813-వ.
ఇట్లు పాండవాగ్రజుప్రార్థనం గైకొని దామోదరుండు సమస్త యాదవులనుఁ గుశస్థలికిఁ బోవంబనిచి కతిపయ పరిజనంబులుం దానును నతనికిఁ బ్రియంబుగాఁ దన్నగరంబునఁ బ్రమోదంబున నుండె” నని చెప్పి మఱియు నిట్లనియె.
10.2-814-చ.
"జనవర! పాండుభూపతనుజాతుఁడు దుస్తరమౌ మనోరథా
బ్ధిని సరసీరుహాక్షుఁ డను తెప్ప కతంబున దాఁటి భూరి శో
భనయుతుఁడై మనోరుజయుఁ బాసి ముదాత్మకుఁడై వెలింగె, న
వ్వనరుహనాభుదాసజనవర్యులకుం గలవే యసాధ్యముల్‌?
10.2-815-వ.
అట్టి యెడ. 

భావము:
ఇలా ధర్మరాజు చేసిన విన్నపం శ్రీకృష్ణుడు మన్నించాడు. యాదవులను అందరినీ కుశస్థలికి పంపించాడు. తాను మాత్రం కొంత పరివారంతో ధర్మరాజు తృప్తిచెందే దాక ఇంద్రప్రస్థనగరంలోనే సంతోషంగా ఉన్నాడు.” అని చెప్పి శుకమహర్షి పరీక్షిత్తుతో మరల ఇలా అన్నాడు. “మహారాజా! రాజసూయం చేయాలనే బహు దుష్కరమైన సముద్రమంతటి తన కోరికను ధర్మరాజు కృష్ణుడనే ఓడ ద్వారా దాటి, మానసికవ్యధ నుండి దూరమై గొప్పఐశ్వర్యంతో సంతోషంతో ప్రకాశించాడు. శ్రీకృష్ణుడి భక్తులకు సాధ్యం కానిది ఏముంది? ఆ విధంగా రాజసూయ యాగం విజయవంతంగా సుసంపూర్ణమైన సమయంలో.... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=61&Padyam=814 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

No comments: