Friday, April 2, 2021

శ్రీకృష్ణ విజయము - 188

( శతధన్వుని ద్రుంచుట )

10.2-92-సీ.
"ఆ మణి శతధన్వుఁ డపహరించుట నిక్క-
  మెవ్వరిచే దాఁప నిచ్చినాఁడొ?
వేగమె నీ వేఁగి వెదకుము పురిలోన-
  వైదేహు దర్శింప వాంఛ గలదు,
పోయి వచ్చెద, నీవు పొ"మ్మని వీడ్కొని-
  మెల్లన రాముండు మిథిలఁ జొచ్చి
పోయిన జనకుండు పొడగని హర్షించి-
  యెంతయుఁ బ్రియముతో నెదురు వచ్చి
10.2-92.1-తే.
యర్ఘ్యపాద్యాది కృత్యంబు లాచరించి
యిచ్చగించిన వస్తువు లెల్ల నిచ్చి
యుండు మని భక్తి చేసిన నుండె ముసలి;
కువలయేశ్వర! మిథిలలోఁ గొన్ని యేండ్లు.
10.2-93-వ.
అంత దుర్యోధనుండు మిథిలానగరంబునకుం జనుదెంచి జనకరాజుచేత సమ్మానితుండై.

భావము:
“శమంతకమణిని శతధన్వుడు అపహరించడం నిజం. ఎవరికి దాచిపెట్టమని ఇచ్చాడో? ఏమిటో? నీవు వెంటనే ద్వారకకు వెళ్ళి మణి కోసం అన్వేషించు. నాకు విదేహ దేశ ప్రభువు అయిన జనకుడిని చూడాలనే కోరిక కలిగింది. నేను వెళ్ళివస్తాను. నీవు ద్వారకకు వెళ్ళు.” అని చెప్పి, శ్రీకృష్ణుడిని పంపించి, మిథిలానగరమునకు వెళ్ళాడు. బలరాముడికి జనకమహారాజు ఆర్ఘ్యపాద్యాది విధులతో సత్కారాలు చేసి అభీష్ట వస్తువులను ఇచ్చి అక్కడ ఉండమని ప్రార్థించాడు. బలరాముడు కొన్ని ఏళ్ళు మిథిలానగరంలో ఉన్నాడు. ఆ సమయంలో దుర్యోధనుడు మిథిలకు వెళ్ళి జనకుని చేత గౌరవింపబడి...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=12&Padyam=92

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: