Thursday, April 29, 2021

శ్రీకృష్ణ విజయము - 211

( నరకాసుర వధకేగుట )

10.2-150-వ.
అనిన నరేంద్రునకు మునీంద్రుం డిట్లనియె "నరకాసురునిచేత నదితి కర్ణకుండలంబులును, వరుణచ్ఛత్త్రంబును, మణిపర్వత మనియెడు నమరాద్రి స్థానంబును గోలుపడుటయు; నింద్రుండు వచ్చి హరికి విన్నవించిన హరి నరకాసుర వధార్థంబు గరుడవాహనారూఢుండై చను సమయంబున హరికి సత్యభామ యిట్లనియె.
10.2-151-శా.
"దేవా! నీవు నిశాటసంఘముల నుద్దీపించి చెండాడ నీ
ప్రావీణ్యంబులు సూడఁ గోరుదుఁ గదా! ప్రాణేశ! మన్నించి న
న్నీ వెంటం గొనిపొమ్ము నేఁడు కరుణన్; నేఁ జూచి యేతెంచి నీ
దేవీ సంహతికెల్లఁ జెప్పుదు భవద్దీప్తప్రతాపోన్నతుల్‌, "
10.2-152-వ.
అనినఁ బ్రాణవల్లభకు వల్లభుం డిట్లనియె.

భావము:
ఈ విధంగా ప్రశ్నించిన పరీక్షిత్తుతో శుకమహర్షి ఇలా చెప్పసాగాడు. “నరకాసురుడు అదితి యొక్క కర్ణకుండలాలనూ, వరుణదేవుడి ఛత్రాన్ని, దేవతల మణి పర్వతాన్ని అపహరించాడు. దేవేంద్రుడు వచ్చి, శ్రీకృష్ణుడికి నరకుని అత్యాచారాలు విన్నవించాడు. శ్రీహరి నరకాసురుని సంహరించడానికి గరుడవాహనం ఎక్కి వెళ్ళబోతున్న సమయంలో సత్యభామ ఇలా అన్నది. “ప్రభూ! ప్రాణనాథ! నీవు విజృంభించి రాక్షసుల సమూహాలను చెండాడుతుంటే, నీ యుద్ధనైణ్యం చూడాలని కోరికగా ఉంది నామాట మన్నించి దయతో నన్ను నీ వెంట తీసుకువెళ్ళు. నేను అక్కడ రణరంగంలో నీ ప్రతాపాన్ని కనులారా చూసివచ్చి, ఇక్కడ రాణులు అందరికీ వివరంగా చెప్తాను." ఈ విధంగా తన ప్రాణసఖి సత్యభామ అడుగగా, శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=19&Padyam=151

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: