Tuesday, April 27, 2021

శ్రీకృష్ణ విజయము - 210

( భద్ర,లక్షణల పరిణయంబు )

10.2-148-వ.
ఇట్లు హరికి రుక్మిణియు, జాంబవతియు, సత్యభామయుఁ, గాళిందియు, మిత్రవిందయు, నాగ్నజితియు, భద్రయు, మద్ర రాజనందనయైన లక్షణయు ననంగ నెనమండ్రు భార్య లైరి; మఱియు నరకాసురుని వధియించి తన్నిరుద్ధకన్యల షోడశసహస్ర కన్యల రోహిణి మొదలైనవారిం బరిగ్రహించె” నన విని.
10.2-149-క.
"ధరకుం బ్రియనందనుఁ డగు
నరకుని హరి యేల చంపె? నరకాసురుఁ డా
వరకుంతల లగు చామీ
కర కుంభస్తనుల నేల కారం బెట్టెన్? "

భావము:
ఈవిధంగా శ్రీకృష్ణుడికి రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్షణ అనే వారు అష్టభార్యలు అయ్యారు. అంతేకాక నరకాసురుని సంహరించి అతని చెరలో నున్న రోహిణి మొదలైన పదహారువేలమంది కన్యకామణులను పరిగ్రహించాడు.” అని చెప్పగా పరీక్షుత్తు విని ఇలా అన్నాడు. “భూదేవి ప్రియపుత్రుడైన నరకాసురుడిని శ్రీకృష్ణుడు ఎందుకు సంహరించాడు? నరకాసురుడు నవయౌవనవతు లైన సుందరీమణులను ఎందుకు చెరసాలలో బంధించాడు?”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=18&Padyam=149

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: