Tuesday, April 27, 2021

శ్రీకృష్ణ విజయము - 209

( భద్ర,లక్షణల పరిణయంబు )

10.2-145-మ.
జనవంద్యన్ శ్రుతకీర్తినంద్యఁ దరుణిన్ సందర్శనక్షోణి పా
ద్యనుజన్ మేనమఱందలిన్ విమలలోలాపాంగఁ గైకేయి ని
ద్ధనయోన్నిద్రఁ బ్రపూర్ణసద్గుణసముద్రన్ భద్ర నక్షుద్ర నా
వనజాతాక్షుఁడు పెండ్లియాడె నహితవ్రాతంబు భీతిల్లఁగన్.
10.2-146-వ.
మఱియును.
10.2-147-చ.
అమరులఁ బాఱఁదోలి భుజ గాంతకుఁడైన ఖగేశ్వరుండు ము
న్నమృతముఁ దెచ్చుకైవడి మదాంధుల రాజుల నుక్కడంచి యా
కమలదళాయతేక్షణుఁడు గైకొని తెచ్చెను మద్రకన్యకన్
సమదమృగేక్షణన్ నయవిచక్షణ లక్షణఁ బుణ్యలక్షణన్.

భావము:
కేకయదేశాధిపతి అయిన ధృష్టకేతుడు, తన మేనత్త శ్రుతకీర్తిల కుమార్తె, సందర్శనాదులకు సోదరి సద్గుణవతి అయిన భద్రను శత్రువు లెల్లరూ తల్లడిల్లగా శ్రీకృష్ణుడు వివాహమాడాడు. ఇంకా అంతేకాక పూర్వం గరుత్మంతుడు దేవతలను పారదోలి, అమృతం తెచ్చిన విధంగా మదాంధులైన రాజులను ఓడించి, శ్రీకృష్ణుడు లేడికన్నుల వంటి కన్నులు కల సుందరీ, మద్రరాజుకుమార్తీ, శుభలక్షణవతీ అయిన లక్షణను పరిగ్రహించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=18&Padyam=147

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: