Sunday, April 25, 2021

శ్రీకృష్ణ విజయము - 207

( నాగ్నజితి పరిణయంబు )

10.2-140-ఉ.
చేలము చక్కఁ గట్టుకొని చిత్రగతిన్ వడి నేడు మూర్తులై
బాలుఁడు దారురూపములఁ బట్టెడు కైవడిఁ బట్టి వీర శా
ర్దూలుఁడు గ్రుద్ది నేలఁ బడఁ ద్రోచి మహోద్ధతిఁ గట్టి యీడ్చె భూ
పాలకులెల్ల మెచ్చ వృషభంబులఁ బర్వత సన్నిభంబులన్.
10.2-141-వ.
ఇట్లు వృషభంబుల నన్నింటినిం గట్టి యీడ్చినం జూచి హరికి నగ్నజిత్తు నాగ్నజితి నిచ్చిన విధివత్ప్రకారంబునం బెండ్లి యయ్యె; నా రాజసుందరు లానందంబును బొంది; రా సమయంబున బ్రాహ్మణాశీర్వాదంబులును, గీత పటహ శంఖ కాహళ భేరీ మృదంగ నినదంబులును జెలంగె; నంతనా కోసలేంద్రుండు దంపతుల రథారోహణంబు సేయించి పదివేల ధేనువులును, విచిత్రాంబరాభరణ భూషితలైన యువతులు మూఁడువేలును, దొమ్మిదివేల గజంబులును, గజంబులకు శతగుణంబులైన రథంబులును, రథంబులకు శతగుణంబులైన హయంబులును, హయంబులకు శతగుణాధికంబైన భట సమూహంబును నిచ్చి పుత్తెంచిన; వచ్చునప్పుడు.

భావము:
శ్రీకృష్ణుడు పైవస్త్రాన్ని నడుముకు బిగించి కట్టుకుని విచిత్రరీతిలో ఏడుమూర్తులు ధరించి బాలుడు కొయ్యబొమ్మలను పట్టుకున్నట్లుగా పర్వతాల వంటి ఏడు వృషభాలను పట్టుకుని గ్రుద్ది, క్రుమ్మి, అవలీలగా నేల మీదకు కూలద్రోసి, కట్టి ఈడ్చాడు. అది చూసి అచ్చటి వారంతా మెచ్చుకున్నారు. ఈ విధంగా శ్రీకృష్ణుడు ఏడువృషభాలను కట్టి ఈడ్వగా, నగ్నజిత్తు తన కుమార్తెను కృష్ణునికి ఇచ్చి వివాహం చేసాడు. ఆ సమయంలో అంతఃపుర కాంతలు అందరూ ఎంతో సంతోషించారు; బ్రాహ్మణులు ఆశీర్వదించారు; మంగళగీతాలు భేరీమృదంగాది వాద్యధ్వనులు మిన్నుముట్టాయి; కోసలరాజు నూతన దంపతులను రథమెక్కించి సాగనంపాడు. పదివేల గోవులను, వస్త్రాభరణాలంకృతలైన మూడువేలమంది కన్యలనూ, తొమ్మిదివేల ఏనుగులనూ, అంతకు వందరెట్లు రథాలనూ, అంతకు వందరెట్లు గుఱ్ఱాలనూ, అంతకు వందరెట్లు సైనికులనూ కానుకగా ఆ రాజు, కృష్ణుడికి ఇచ్చాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=17&Padyam=141

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: