Tuesday, March 30, 2021

శ్రీకృష్ణ విజయము - 187

( శతధన్వుని ద్రుంచుట )

10.2-89-వ.
అని యిట్లక్రూరుం డుత్తరంబు పలికిన నమ్మహామణి యక్రూరుని యొద్ద నునిచి, వెఱచి శతధన్వుండు తురగారూఢుండై శతయోజన దూరంబు సనియె; గరుడ కేతనాలంకృతంబైన తేరెక్కి రామ కృష్ణులు వెనుచని; రంత నతండును మిథిలానగరంబుఁజేరి తత్సమీపంబు నందు.
10.2-90-చ.
తురగము డిగ్గి తల్లడముతో శతధన్వుఁడు పాదచారియై
పరువిడఁ బోకు పోకు మని పద్మదళాక్షుఁడు గూడఁ బాఱి భీ
కరగతి వాని మస్తకము ఖండితమై పడ వ్రేసెఁ జక్రముం
బరిహతదైత్యచక్రముఁ బ్రభాచయ మోదితదేవశక్రమున్.
10.2-91-వ.
ఇట్లు హరి శతధన్వుని వధియించి వాని వస్త్రంబులందు మణి వెదకి లేకుండటఁ దెలిసి బలభద్రునికడకు వచ్చి “శతధన్వుం డూరక హతుం డయ్యె, మణి లే” దనిన బలభద్రుం డిట్లనియె.

భావము:
ఆ విధంగా అక్రూరుడు అనగానే, శతధన్వుడు శమంతకమణిని అక్రూరుడికి ఇచ్చి, భయంతో గుఱ్ఱమెక్కి నూరుయోజనల దూరం పారిపోయాడు. గరుడధ్వజం వెలుగొందే రథం ఎక్కి రామకృష్ణులు అతనిని వెంటాడారు. శతధన్వుడు మిథిలానగరం చేరాడు. అక్కడ శతధన్వుడు గుఱ్ఱం దిగి వేగంగా పరిగెత్తుతుండగా, శ్రీకృష్ణుడు “పోకు పోకు” అంటూ అతడిని వెంటాడి, రాక్షసులను సంహరించేదీ, దేవతలను తన ప్రభలతో సంతోషింపజేసేది అయిన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆ చక్రఘాతానికి శతధన్వుడి శిరస్సు భయంకరంగా తెగి క్రింద పడింది. శ్రీకృష్ణుడు శతధన్వుడిని సంహరించి అతని దగ్గర వెతికాడు కాని, శమంతకమణి కన్పించలేదు. అంతట బలరాముడి దగ్గరకు వచ్చి “శతధన్వుడు అనవసరంగా చచ్చిపోయాడు. అతడి దగ్గర మణి లేదు” అని చెప్పాడు. అప్పుడు బలరాముడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=12&Padyam=91

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: