Tuesday, September 27, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౪౦(640)

( కృష్ణుని భార్యా సహస్ర విహారంబు ) 

10.2-1328-ఉ.
"వారక కృష్ణుఁ డిప్పగిది వైదికవృత్తి గృహస్థధర్మ మే
పారఁగ బూని ధర్మమును నర్థముఁ గామము నందుఁ జూపుచుం
గోరికమీఱ సజ్జనులకుం గతి దాన యనంగ నొప్పి సం
సారిగతిన్ మెలంగె నృపసత్తమ! లోకవిడంబనార్థమై.
10.2-1329-సీ.
హరి యిట్లు గృహమేధి యగుచు శతోత్తర-
  షోడశసాహస్ర సుందరులను
మును నీకు నెఱుఁగఁ జెప్పినరీతి నందఱ-
  కన్నిరూపములు దా నర్థిఁ దాల్చి
కైకొని యొక్కక్క కామినీమణి యందు-
  రమణ నమోఘ వీర్యమునఁ జేసి
పదురేసి కొడుకులం బడసె రుక్మిణ్యాది-
  పట్టమహిషులకుద్భవులు నైన
10.2-1329.1-తే.
నందనులలోన ధరణి నెన్నంగ బాహు
బల పరాక్రమ విజయ సంపద్విశేష
మాని తాత్ములు పదునెనమండ్రు; వారి
నెఱుఁగ వినిపింతు, వినుము రాజేంద్రచంద్ర! "

భావము:
“రాజోత్తమా! పరీక్షిత్తూ! ఈ విధంగా వేదోక్తమైన పద్ధతిలో గృహస్థధర్మాన్ని స్వీకరించి, ధర్మార్ధ కామాదులను సాధిస్తూ, ఉత్తములకు తానే దిక్కు అయి ఉంటూ, లోకం తనను అనుసరించి ఇలా నడవాలి అని తెలుసుకునేలా, తానూ ఒక సంసారిలా శ్రీకృష్ణుడు నటించాడు. పరీక్షిత్తు మహారాజా! ఈ విధంగా పదహారువేల సుందరీమణులకు అందరకూ అన్నిరూపాలు ధరించి గృహస్థుడై శ్రీకృష్ణుడు ఏలుకున్నాడు. అమోఘ వీర్యుడైన ఆ మహానుభావుడికి, వారిలో ఒక్కొక్కరి యందు పదిమంది చొప్పున పుత్రులు పుట్టారు. రుక్మిణి మొదలైన పట్టమహిషులకు పుట్టిన పుత్రులలో పదునెనిమిదిమంది భుజబల, పరాక్రమ, వైభవాలతో ప్రసిద్ధులయ్యారు. వారి పేర్లను చెప్తాను. శ్రద్ధగా విను.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=87&Padyam=1329

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: