Monday, September 12, 2022

శ్రీకృష్ణ విజయము - ౬౨౫(625)

( విప్రుని ఘనశోకంబు ) 

10.2-1297-వ.
అవధరింపుము దేవా! యర్జునుం డనెడి పౌరుషవిహీనుం డాడిన వృథాజల్పంబులు నమ్మి పుత్త్రుం గోలువడి బేలనైన నన్ను నే మందు? నిఖిల విశ్వోత్పత్తి స్థితి లయంబులకుఁ బ్రధాన హేతుభూతుండవయిన నీవు సమర్థుండవయ్యు, వారింపంజాలక చూచుచుండ, నొక్క మనుష్యమాత్రుండు దీర్పంజాలెడువాఁడు గలఁడె?” యని వెండియు.
10.2-1298-క.
"ఎక్కడి పాండుతనూభవుఁ?
డెక్కడి విలుకాఁడు? వీని కెక్కడి సత్త్వం?
బెక్కడి గాండీవము? దన
కెక్కడి దివ్యాస్త్ర సమితి? యే మనవచ్చున్? "

భావము:
మహాత్మా! నా విన్నపాన్నిఆలకించు. పౌరుషహీనుడైన పార్థుని డాంబిక వచనాలను నమ్మి అమాయకుడిని అయి కొడుకును పోగొట్టుకున్న నన్ను నేను ఏమని నిందించుకోవాలి. సమస్త జగత్తు సృష్టి స్థితి లయాలకు మూలకారకుడవు అయిన నీవు సమర్ధుడివే అయినా వారించలేక ఊరకున్నావు. మానవమాత్రుడు ఇంతటి మహాకార్యం ఎక్కడ నెరవేర్చగలడు?” అని ఇంకా ఇలా అన్నాడు. “ఈ పాండుతనయుడు ఒక విలుకాడట; ఇతగాడి మాటలు యదార్థ మట; ఇదొక గాండీవ మట; ఇతగాడికి దివ్యాస్త్రాలంటూ ఉన్నాయిట; ఏ మనగలం.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1298

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: