Saturday, June 25, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౭౬(576)

( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1201-క.
అని సర్వలోక విభుఁ డగు
వనజోదరుఁ డానతిచ్చు వాక్యంబుల జా
డన భూమీసురుఁ డమ్ముని
జనులకు సద్భక్తిఁ బూజ సలిపెన్ వరుసన్.
10.2-1202-చ.
ఎనయఁగఁ గృష్ణుఁ డంత మిథిలేశ్వర భూసురులం గృపావలో
కన మొలయన్ననూనసుభగస్థితిఁ బొందఁగఁ జేసి వారి వీ
డ్కొని రథమెక్కి దివ్యమునికోటియుఁ దానును వచ్చెఁ గ్రమ్మఱన్
జనవర! మోక్షదం బగు కుశస్థలికిం బ్రమదాంతరంగుఁడై!"

భావము:
లోకాలు సమస్తమునకు ప్రభువు అయిన శ్రీకృష్ణుడి అనుజ్ఞ ప్రకారం శ్రుతదేవుడు అత్యంతభక్తితో ఆ మునిపుంగవులను పూజించాడు. ఓ రాజా పరీక్షిత్తు! మిథిలాదేశ ప్రభువు బహుళాశ్వుని, విప్రుడు శ్రుతదేవుని ఆ విధంగా శ్రీకృష్ణుడు కరుణతో కటాక్షించి వారికి శుభాలు ప్రసాదించాడు. వారి దగ్గర సెలవు తీసుకుని సంతోషాతంరంగుడై రథం ఎక్కి మునులతోపాటు మోక్షదాయకమైన ద్వారకను తిరిగి చేరుకున్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1202

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

No comments: