Thursday, June 9, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౬౩(563)

( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1179-వ.
అట్లు కృష్ణుండు వారల జూచువేడ్క నిజ స్యందనారూఢుండై, నారద, వామదేవాత్రి, కృష్ణ, రామ, సితారుణ, దివిజగురు, కణ్వ, మైత్రేయ, చ్యవనులును, నేనును మొదలైన మును లనుగమింపం జనుచుఁ దత్తద్దేశ నివాసులగు నానర్తక, ధన్వ, కురుజాంగల, వంగ ,మత్స్య, పాంచాల, కుంతి, మధు, కేకయ, కోస లాది భూవరులు, వివిధ వస్తుప్రచయంబులు గానిక లిచ్చి సేవింప, గ్రహమధ్యగతుండై దీపించు సూర్యునిం బోలి, యప్పుండరీకాక్షుండు మందస్మిత సుందరవదనారవిందుం డగుచు వారలం గరుణార్ద్రదృష్టిం జూచి, యోగక్షేమంబులరసి, సాదరభాషణంబుల నాదరించుచుఁ, గతిపయ ప్రయాణంబులం జనిచని విదేహనగరంబు డాయంజనుటయు; నా బహుళాశ్వుండు నమ్మాధవు రాక విని మనంబున హర్షించుచు వివిధపదార్థంబులు గానికలుగాఁగొని, తానును శ్రుతదేవుండును నెదురుగాఁ జనుదెంచి; యప్పుడు.

భావము:
శ్రీకృష్ణుడు ఆ బహుళాశ్వుడు శ్రుతదేవుడులను చూడాలన్న ఉత్సాహంతో రథాన్ని ఎక్కి ద్వారక నుంచి మిథిలానగరానికి బయలుదేరాడు. అతని కూడా వామదేవుడు, అత్రి, కృష్ణద్వైపాయనుడు, పరశురాముడు, అసితుడు, అరుణుడు, బృహస్పతి, కణ్వుడు, మైత్రేయుడు, చవనుడు మున్నగు మునిముఖ్యులూ వెళ్ళారు. వారిలో నేనూ ఉన్నాను. మార్గంలో అనర్తము, కేకయ, కురుజాంగలము, ధన్వము, వంగ, మత్స్య, పాంచాలము, కుంతి, మధు, కోసల మున్నగు దేశాల ప్రభువులు కృష్ణుడికి నానావిధాలైన కానుకలు బహూకరించి సేవించారు. గ్రహాలనడుమ ప్రకాశించే సూర్యుడిలా కృష్ణుడు మందహాసంచేస్తూ వారందరి మీద కరుణార్ద్ర దృష్టులను ప్రసరింపచేస్తూ వారి యోగక్షేమాలు విచారించాడు. వారితో ఆప్యాయంగా మట్లాడాడు. ఆ తరువాత కొన్నాళ్ళు ప్రయాణంచేసి మిథిలానగరాన్ని చేరాడు. శ్రీకృష్ణుని రాక తెలిసి బహుళాశ్వుడు చాలా ఆనందించాడు. వివిధ పదార్థాలను తీసుకుని అతడు శ్రుతదేవునితోపాటు శ్రీకృష్ణుడిని ఆహ్వానించడానికి ఎదురువచ్చాడు. అప్పుడు...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1179

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

No comments: