Tuesday, June 7, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౬౧(561)

( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1177.1-తే.
నరనాథ! విను భువనప్రసిద్ధంబుగ-
  దీపించు నట్టి విదేహదేశ
మందు భూకాంతకు నాననదర్పణం-
  బనఁ దనర్చిన మిథి లను పురమునఁ
గలఁడు శ్రీహరిపాదకంజాత భక్తుండు,-
  గళితరాగాది వికారుఁ, డమల
చరితుఁ, డక్రోధుండు, శాంతుండు, నిగమార్థ-
  కోవిదుం, డగు శ్రుతదేవుఁ డనెడి
10.2-1177.1-తే.
భూసురోత్తముఁ డొకఁ డనిచ్ఛాసమాగ
తంబు తుషమైన హేమ శైలంబు గాఁగఁ
దలఁచి పరితోష మందుచుఁ దగ గృహస్థ
ధర్మమున నుండె సముచితకర్ముఁ డగుచు.

భావము:
“ఓ మహారాజా! మిథిలానగరం లోకప్రసిద్ధమైన విదేహదేశంలో భూదేవి ముఖానికి తళుకుటద్దంవలె ఉంటుంది. ఆ నగరంలో శ్రుతదేవుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు గొప్ప హరిభక్తుడు; రాగాది వికారాలు లేనివాడు; వినిర్మలచరిత్రుడు; కోపము లేని పూర్తి శాంత స్వభావుడు; వేదార్థాలు తెలిసినవాడు; అతడు తనంత తానుగా ప్రాప్తించింది లేశమైనా దాన్ని మేరుపర్వత మంతగా భావించి సంతృప్తి చెందేవాడు. శ్రుతదేవుడు నిత్యమూ విద్యుక్తకర్మలను నిర్వహిస్తూ గృహస్థధర్మాన్ని పాలిస్తూ ఉండేవాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1177

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

No comments: