Thursday, October 28, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౮౦(380)

( శిశుపాలుని వధించుట ) 

10.2-796-వ.
అనిన మునివరునకు భూవరుం డిట్లనియె.
10.2-797-క.
"కమలాక్షుని నిందించిన
దమఘోషతనూభవుండు దారుణ మల కూ
పమునుం బొందక యే క్రియ
సుమహితమతిఁ గృష్ణునందుఁ జొచ్చె మునీంద్రా! "
10.2-798-వ.
అనిన శుకయోగి రాజయోగి కిట్లనియె.
10.2-799-మ.
"మధుదైత్యాంతకుమీఁది మత్సరమునన్ మత్తిల్లి జన్మత్రయా
వధి యే ప్రొద్దుఁ దదీయ రూప గుణ దివ్యధ్యాన పారీణ ధీ
నిధి యౌటన్ శిశుపాలభూవిభుఁడు తా నిర్ధూత సర్వాఘుఁడై
విధి రుద్రాదుల కందరాని పదవిన్ వే పొందె నుర్వీశ్వరా! 

భావము:
ఇలా చెప్పిన శుక యోగీశ్వరుడితో మహారాజు పరీక్షిత్తు ఇలా అన్నాడు. “ఓ మునీశ్వరా! శుకా! శ్రీకృష్ణుడిని అంతగా దూషించిన ఆ దమఘోష సుతుడైన శిశిపాలుడు భయంకర నరకకూపంలో పడకుండా, అంత గొప్పగా భగవంతుడైన కృష్ణుడిలో ఎలా ప్రవేశించాడయ్యా.” ఈ మాదిరిగా సందేహం వెలిబుచ్చిన మహారాజుతో మహర్షి ఇలా అన్నాడు. “ఓ రాజేంద్రా! పరీక్షిత్తూ! మధుసూదనుడైన శ్రీహరి మీది మాత్సర్యంతో మదోన్మత్తుడై మూడు జన్మలనుండి విడువకుండా నిందించడం పేర, ఎల్లప్పుడు ఆ విష్ణుమూర్తి దివ్యమైన రూప గుణాలను ధ్యానిస్తూ ఉండడం వలన, పాపాలు సమస్తం నుండి విముక్తుడై ఈ శిశుపాలుడు బ్రహ్మరుద్రాదులకు సైతం అందరాని పదవిని అందుకున్నాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=60&Padyam=799 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

No comments: