Tuesday, October 26, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౭౮(378)

( శిశుపాలుని వధించుట ) 

10.2-792-చ.
అని తను దూఱనాడిన మురాంతకుఁడా శిశుపాలు వాక్యముల్‌
విని మదిఁ జీరికిం గొనఁడు విశ్రుతఫేరవ రావ మాత్మఁ గై
కొనని మృగేంద్రురీతి మునికోటియు రాజులుఁ బద్మనాభు నా
డిన యవినీతి భాషలకు డెందమునం గడు వంత నొందుచున్.
10.2-793-ఉ.
వీనులుమూసికొంచు వినవిస్మయ మంచు "ముకుంద! మాధవా!
శ్రీనిధి! వీని నేగతికిఁ జేర్చెదొ" యంచు దురాత్ముఁ దిట్టుచు
న్నా నరనాథులున్ మునులు నచ్చట నిల్వక పోవఁ బాండు సం
తానము లప్రమేయ బలదర్ప మహోద్ధత రోషచిత్తులై. 

భావము:
ఇలా శిశుపాలుడు నిందిస్తూ ఉంటే, నక్కకూతలను లెక్కపెట్టని సింహంలాగా శ్రీకృష్ణుడు లక్ష్యపెట్టలేదు కానీ, సభలో ఉన్న ఋషులు, రాజులు, మాత్రం శిశుపాలుడు పలికిన దుర్భాషలకు చాలా బాధపడ్డారు. కృష్ణుడిని నిందిస్తున్న శిశుపాలుడి దురాలాపాలను వినలేక మునులు రాజులు చెవులు మూసుకుని ఆశ్చర్యపడుతూ “ఓ కృష్ణా! వీడిని ఎలా కడతేరుస్తావో ఏమిటో?” అంటూ శిశుపాలుడిని నిందిస్తూ సభ నుంచి నిష్క్రమించారు. పాండవులకు శిశుపాలుడి మీద ఎంతో కోపం వచ్చింది. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=60&Padyam=793 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

No comments: