Wednesday, October 27, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౭౯(379)

( శిశుపాలుని వధించుట ) 

10.2-794-వ.
అప్పుడు కేకయ సృంజయభూపతులుం దామును వివిధాయుధ పాణులై యదల్చి నిల్చిన వాఁడునుం బిఱుతివక యదల్చి పలకయు వాలునుం గైకొని, భుజాగర్వదుర్వారుండై గోవిందునిఁ దదనువర్తులైన వారలం గుపితుండై నిందింప నమ్ముకుందుం డాగ్రహంబున లేచి తన కట్టెదుర నెదిర్చియున్న శిశుపాలుని రూక్షేక్షణంబుల వీక్షించుచు, నా క్షణంబ తన్మస్తకంబు నిశితధారా కరాళంబైన చక్రంబున నవక్రపరాక్రముండై రుధిరంబు దొరఁగం దునుమ, నమ్మహాకలకలం బాకర్ణించి చైద్యబలంబులు దదీయపక్షచరులైన భూపతులును గనుకనిం బఱచి; రయ్యవసరంబున.
10.2-795-క.
మునివరులును జనపతులునుఁ
గనుఁగొని వెఱఁగంద జైద్యుగాత్రమునందుం
డనుపమ తేజము వెలువడి
వనజోదరు దేహమందు వడిఁ జొచ్చె నృపా! " 

భావము:
ఆ సమయంలో కేకయ రాజులు, సృంజయ రాజులు, పాండవులు ఆయుధాలు ధరించి శిశుపాలుడిని అదలించి నిలబడ్డారు. వాడు కూడ భుజబలగర్వంతో పాండ వాదులను లక్ష్యపెట్టక, కత్తీ డాలూ పట్టుకుని కృష్ణుడిని అతడిని అనుసరించే వారిని కోపంగా నిందించసాగాడు. అప్పుడు ముకుందుడు ఆగ్రహంతో లేచి తనకు ఎదురుగా పోరుకు సిద్ధంగా ఉన్న శిశుపాలుడిని తీవ్రంగా చూస్తూ, బహు వాడి కలదైన తన సుదర్శన చక్రంతో వాడి తల తరిగాడు. ఆ భయంకర కలకలాన్ని వినిన చూసిన, శిశుపాలుడి సైన్యము, అతడి పక్షపు రాజులు తత్తరపాటుతో పారిపోయారు. ఓ పరీక్షిన్మహారాజా! ఆ సమయంలో శిశుపాలుని దేహంనుంచి దేదీప్యమానమైన తేజస్సు వెలువడి ఆ పద్మనాభుడు కృష్ణుడు శరీరంలో ప్రవేశించింది, మునీశ్వరులు రాజులు అది చూసి ఆశ్చర్యపోయారు.” 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=60&Padyam=794 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

No comments: