Thursday, October 21, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౭౩(373)

( రాజసూయంబు నెఱవేర్చుట ) 

10.2-781-క.
అని సహదేవుఁడు పలికిన
విని యచ్చటి జనులు మనుజవిభులును ఋషులున్
మునుకొని మనములు మోదము
దనుకఁగ నిది లెస్స యనిరి ధర్మజుఁ డంతన్.
10.2-782-క.
మునిజనమానసమధుకర
వనజాతములైన యట్టి వారిజదళలో
చను పదయుగళప్రక్షా
ళన మొగిఁ గావించి తజ్జలంబులు భక్తిన్.
10.2-783-క.
తానును గుంతియు ననుజులు
మానుగ ద్రుపదాత్మజయును మస్తకములఁ బెం
పూనిన నియతి ధరించి మ
హానందము బొంది రతిశయప్రీతిమెయిన్. 

భావము:
అని సహదేవుడు చెప్పగా ఆ సభాసదులు, రాజులు, ఋషులు మొదలైన వారందరూ సంతోషంతో “ఇదే సముచిత మైనది” అని అంగీకరించారు. అప్పుడు ధర్మరాజు మహామునుల మనస్సులు అనే తుమ్మెదలకు పద్మాలవంటి వైన కలువరేకులు వంటి కన్నులు కల శ్రీకృష్ణుని పాదాలు రెండూ భక్తితో కడిగి, ఆ జలాన్ని తానూ, కుంతీ, భీమాదులూ, ద్రౌపదీ అమితమైన ప్రీతితో తమ శిరస్సులమీద శ్రీకృష్ణుని పాదజలాన్ని ధరించి ఎంతో సంతోషించారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=59&Padyam=783 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

No comments: