Monday, October 25, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౭౭(377)

( శిశుపాలుని వధించుట ) 

10.2-790-సీ.
గురుదేవశూన్యుండు, కులగోత్రరహితుండు,-
  దలిదండ్రు లెవ్వరో తడవఁ గాన,
మప్పులఁ బొరలెడు, నాదిమధ్యావసా-
  నంబులం దరయ మానంబు లేదు,
బహురూపియై పెక్కుభంగుల వర్తించు,-
  వావి వర్తనములు వరుస లేవు
పరికింప విగతసంబంధుండు, తలపోయ-
  మా నిమిత్తంబున మాని సయ్యెఁ
10.2-790.1-తే.
బరఁగ మున్ను యయాతిశాపమునఁ జేసి
వాసి కెక్కదు యీ యదువంశమెల్ల,
బ్రహ్మతేజంబు నెల్లఁ గోల్పడిన యితఁడు
బ్రహ్మఋషి సేవ్యుఁ డగునె గోపాలకుండు?
10.2-791-క.
జారుఁడు, జన్మావధియునుఁ
జోరుఁడు, ముప్పోకలాఁడు సుమహితపూజా
చారక్రియలకు నర్హుఁడె?
వారక యితఁ" డనుచు నశుభవాక్యస్ఫూర్తిన్. 

భావము:
ఈ కృష్ణుడికి గురువులు దేవుడు లేరు, కులం గోత్రం లేవు, తల్లితండ్రులు ఎవరో తెలియదు, నీటి మీద శయనిస్తాడు, ఆది మధ్యాంతాలు కానరావు, నటుడిలా అనేక రూపాలు ధరిస్తూ రకరకాలరీతులో ప్రవర్తిస్తుంటాడు, వర్తించే వావివరుసులు లేవు, ఏ బాంధవ్యబంధాలు లేవు. ఇతడు మా కారణంగానే మాననీయుడయ్యాడు కానీ, యయాతిశాపం వలన ఈ యదువంశం ప్రసిద్ధి అణగారిపోయింది. వీరి వంశం బ్రహ్మతేజాన్నికోల్పోయింది. ఇలాంటి ఈ గోపాలకుడు బ్రహ్మర్షుల పూజకు ఎలా అర్హుడవుతాడు? ఇతడు పుట్టింది మొదలు చోరుడు, జారుడు, మూడు త్రోవల్లో నడచేవాడు. మరి ఇతగాడు ఇంత గొప్ప పూజకు ఎలా అర్హుడు అవుతాడు?” అంటూ అమంగళకరమైన మాటలతో శిశుపాలుడు శ్రీకృష్ణుడిని నిందించాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=60&Padyam=791 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

No comments: