Sunday, January 31, 2021

శ్రీ కృష్ణ విజయము - 139

( కాలయవనుడు నీరగుట )

10.1-1638-ఆ.
అనుచు యవనుఁ డట్టహాసంబు గావించి
చటుల కఠిన కులిశ సదృశమైన
పాదమెత్తి తన్నెఁ బాఱి తద్దేహంబు
నగగుహం బ్రతిస్వనంబు నిగుడ.
10.1-1639-ఉ.
తన్నిన లేచి నీల్గి కనుదమ్ములు మెల్లన విచ్చి లోపలన్
సన్నపు గిన్క వర్ధిల దిశల్గని దృష్టి సమిద్ధ విగ్రహో
త్పన్న మహాగ్నికీలముల భస్మముచేసె నతండు సాయక
చ్ఛిన్నవిరోధికంఠవను శ్రీభవనున్ యవనున్ లఘుక్రియన్.
10.1-1640-వ.
ఇట్లేక క్షణమాత్రంబున యవనుండు నీఱయ్యె” ననిన విని రాజు యిట్లనియె.

భావము:
అంటూ కాలయవనుడు అట్టహాసంగా నవ్వి, పరుగెట్టుకొని వెళ్ళి, ఎగిరి, కర్కశమైన వజ్రాయుధంవంటి తన కాలితో ఆ నిద్రపోతున్న పురుషుడిని తన్నాడు. ఆ తన్నుకు పర్వతగుహ అంతా మారుమ్రోగిపోయింది. అలా యవనుడు తన్నడంతోనే నిద్రలేచిన ఆ పురుషుడు ఒళ్ళువిరుచుకుంటూ, పద్మాలవంటి కన్నులువిచ్చి, పొటమరించిన కోపం వృద్ధిపొందగా. నాలుగు మూలలా చూసాడు. తన చూపులలో మహోగ్రమైన ఆగ్రహంవలన జనించిన మహాగ్ని జ్వాలలతో ఆయన, శత్రువుల కుత్తుకలనే అడవులను తన కత్తితో ఛేదించినవాడూ, సంపదలకు నిలయమైనవాడూ అయిన కాలయవనుడిని అలవోకగా బూడిద చేసేసాడు. అలా ఒక్క క్షణకాలంలో యవనుడు భస్మ మైపోయాడు” అని శుకమహర్షి చెప్పగా వినిన పరీక్షిన్నరేంద్రుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=198&padyam=1639

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: