Saturday, January 2, 2021

శ్రీ కృష్ణ విజయము - 112

( గురుపుత్రుని తెచ్చి ఇచ్చుట )

10.1-1432-క.
కాలుని వీటికిఁ జని మృత
బాలకుఁ దే నొరుల వశమె? భవదీయ కృపన్
మేలు దొరఁకొనియె మాకు; వి
శాల మగుంగాత మీ యశము లోకములన్.
10.1-1433-వ.
మహాత్ములార! యేను కృతార్థుండ నైతి" నని దీవించిన సాందీపుని వీడ్కొని కృతకృత్యులై రామకృష్ణులు రథారోహణంబు చేసి మథురకుఁ జనుదెంచి పాంచజన్యంబుఁ బూరించిన విని నష్టధనంబులు గనినవారి భంగిం బ్రజలు ప్రమోదించి; రంత నొక్కనాఁ డేకాంతంబున.
10.1-1434-శా.
"నా పైఁ జిత్తము లెప్పుడున్ నిలుపుచున్ నా రాకఁ గాంక్షించుచున్
నా పే రాత్మల నావహించుచు వగన్ నానాప్రకారంబులన్
గోపాలాంగన లెంత జాలిఁబడిరో? కోపించిరో? దూఱిరో?
వ్రేపల్లెన్ నిజధర్మ గేహములలో విభ్రాంతచైతన్యలై."
10.1-1435-వ.
అని చింతించి.

భావము:
యమపురికి వెళ్ళి చనిపోయిన పిల్లవాడిని తెచ్చి ఇవ్వడము అన్నది మీకు చెల్లింది కాని, ఇతరులకు సాధ్యమా? ఎంతో శ్రద్ధాభక్తులతో మాకు మేలు కలిగించారు. మీ కీర్తి లోకాలలో విస్తరిల్లు కాక! ఓ పుణ్యాత్ములారా! నేను ధన్యుడను అయ్యాను.” అని సాందీపని వారిని దీవించాడు. రామకృష్ణులు కృతార్ధులై గురువు దగ్గర సెలవు పుచ్చుకుని రథం ఎక్కి మధుర వెళ్ళి శంఖాన్నిఊదారు. అప్పుడు ప్రజలు పోయిన సొమ్ము తిరిగి లభించిన వారిలా సంతోషించారు. శ్రీకృష్ణుడు ఒకరోజు ఏకాంతంలో ఇలా ఆలోచించసాగాడు “వ్రేపల్లెలోని గొల్లముదితలు సదా నా మీదనే మనసు లగ్నం చేసుకుని ఉంటారు. నా ఆగమనం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. నా పేరు మనసులో నిరంతరం ధ్యానిస్తూ, ప్రణయపారవశ్యంతో తమ పుణ్య గృహాలలో అనేక విధాలుగా వగలు చెందుతుంటారు. పాపం వారెంత దైన్యం పాలవుతున్నారో? నాపై ఎంత కినుక వహించారో? నన్నెంతగా దూషించుతున్నారో?”. ఇలా తలపోసిన కృష్ణుడు . . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=172&padyam=1434

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: