Friday, January 8, 2021

శ్రీ కృష్ణ విజయము - 114

( గోపస్త్రీలకడకుద్ధవుని బంపుట )

10.1-1439-క.
సందేహము మానుం డర
విందాననలార! మిమ్ము విడువను వత్తున్
బృందావనమున కని హరి
సందేశము పంపె" ననుము సంకేతములన్."
10.1-1440-వ.
అని మందహాస సుందర వదనారవిందుండై కరంబు కరంబున నవలంబించి, సరసవచనంబు లాడుచు వీడుకొల్పిన నుద్ధవుండును రథారూఢుండై సూర్యాస్తమయ సమయంబునకు నందవ్రజంబు జేరి వనంబులనుండి వచ్చు గోవుల చరణరేణువులం బ్రచ్ఛన్న రథుండై చొచ్చి, నందు మందిరంబు ప్రవేశించిన.

భావము:
సంకేతస్థలమునకు వెళ్ళి గోపికలతో “పద్మముల వంటి మోములు కల పడతులారా! సంశయం మానండి. మిమ్మల్ని వదలిపెట్టను. బృందావనానికి వస్తాను” అని కృష్ణుడు వార్త పంపాడని నీవు చెప్పు.” అని చిరునవ్వుతో అందమైన అరవిందం వంటి వదనము గల గోవిందుడు ఉద్ధవుడి చేతిలో చెయ్యేసి పట్టుకుని, సరసమైన మాటలు పలుకుతూ సాగనంపాడు. ఉద్ధవుడు రథము ఎక్కి సూర్యుడు అస్తమించే వేళకు గోకులం చేరాడు. అడవులలో మేతమేసి వచ్చే గోవుల పాద ధూళి అతని రథాన్ని కప్పివేస్తుండగా, ఉద్ధవుడు వ్రేపల్లె చేరి నందుడి ఇంటికి వెళ్ళాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=173&padyam=1440

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: