Monday, January 18, 2021

శ్రీ కృష్ణ విజయము - 122

( కాలయవనుని ముట్టడి)

10.1-1590-వ.
అని పలికి కాలయవనుండు మూడుకోట్ల మ్లేచ్ఛవీరులం గూడుకొని, శీఘ్రగమనంబున దాడివెడలి, మథురాపురంబుమీఁద విడిసినం జూచి, బలభద్ర సహితుండై కృష్ణుం డిట్లని వితర్కించె.
10.1-1591-సీ.
"యవనుండు పుర మెల్ల నావరించెను నేటి-
  యెల్లిటి యెల్లుండి యీ నడుమను
మాగధుండును వచ్చి మనమీఁద విడియును-
  యవన మాగధులు మహాప్రబలులు
పురి రెండువంకలఁ బోరుదు రట్టిచో-
  నోపిన భంగి నొక్కొక్కచోట
మనము యుద్ధముఁ సేయ మఱియొక్కఁ డెడఁ సొచ్చి-
  బంధుల నందఱఁ బట్టి చంపు
10.1-1591.1-తే.
నొండె గొనిపోయి చెఱఁబెట్టు నుగ్రకర్ముఁ
డైన మాగధుఁ; డదిగాన యరివరులకు
విడియఁ బోరాడఁగా రాని విషమభూమి
నొక్క దుర్గంబుఁ జేసి యం దునుపవలయు."
10.1-1592-వ.
అని వితర్కించి సముద్రు నడిగి సముద్రమధ్యంబునం బండ్రెండు యోజనంబుల నిడుపు నంతియ వెడల్పుం గల దుర్గమ ప్రదేశంబు సంపాదించి, తన్మధ్యంబునం గృష్ణుండు సర్వాశ్చర్యకరంబుగ నొక్క నగరంబు నిర్మింపు మని విశ్వకర్మం బంచిన.

భావము:
ఆ విధంగా నారదుడితో వీరోక్తులాడి, కాలయవనుడు మూడుకోట్ల మ్లేచ్ఛవీరులను సమకూర్చుకుని అతి వేగంగా దాడి వెడలి, మధురానగరాన్ని ముట్టడించాడు. అది చూసి బలరాముడితో శ్రీకృష్ణుడు ఇలా ఆలోచించాడు. “యవనుడు పట్టణాన్ని ముట్టడించాడు. ఇవాళో రేపో ఎల్లుండో మాగధుడు కూడా మన మీద దాడిచేస్తాడు. కాలయవనుడు జరాసంధుడు మిక్కిలి బలవంతులు. వారు నగరం రెండు వైపుల చేరి పోరాడుతారు. అప్పుడు, మనం శక్తికొద్దీ ఒకచోట యుద్ధం చేస్తుంటే, మరొకడు సందు చూసుకుని మన చుట్టా లందరినీ పట్టి చంపవచ్చు, లేదా పట్టుకుపోయి చెర పట్టవచ్చు. జరాసంధుడు అతి క్రూరకర్ముడు. కాబట్టి శత్రువులు దండు విడియుటకు, పోరు సల్పుటకు వీలు కాని ప్రదేశంలో ఒక దుర్గం నిర్మించి, అందులో మనవారిని అందరినీ ఉంచాలి.” అని ఆలోచించి, శ్రీకృష్ణుడు సముద్రుణ్ణి అడిగి సముద్రం మధ్యన పన్నెండు ఆమడల పొడవు, అంతే వెడల్పు కల ఒక దుర్గమ ప్రదేశాన్ని సంపాదించాడు. దాని మధ్య అందరికీ అశ్చర్యం కలిగించే ఒక పట్టణం నిర్మించ మని దేవశిల్పి అయిన విశ్వకర్మను ఆజ్ఞాపించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=194&padyam=1591

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: