Thursday, January 21, 2021

శ్రీ కృష్ణ విజయము - 129

( పౌరులను ద్వారకకు తెచ్చుట )

10.1-1615-వ.
ఇట్లు విశ్వకర్మ నిర్మితంబైన ద్వారకానగరంబునకు నిజయోగ ప్రభావంబున మథురాపురజనుల నందఱం జేర్చి, బలభద్రున కెఱింగించి; తదనుమతంబున నందనవనంబు నిర్గమించు పూర్వదిగ్గజంబు పెంపున, మేరుగిరిగహ్వరంబు వెలువడు కంఠీరవంబు తెఱంగున హరిహయ దిగంతరాళంబున నుదయించు నంధకారపరిపంథికైవడి మథురానగరంబు వెలువడి నిరాయుధుండై యెదుర వచ్చుచున్న హరిం గని.
10.1-1616-మ.
"కరి సంఘంబులు లేవు; రావు తురగౌఘంబుల్; రథవ్రాతముల్
పరిసర్పింపవు; రారు శూరులు ధనుర్భాణాసి ముఖ్యాయుధో
త్కరముం బట్టఁడు; శక్రచాప యుత మేఘస్ఫూర్తితో మాలికా
ధరుఁ డొక్కం డదె నిర్గమించె నగరద్వారంబునం గంటిరే.

భావము:
అలా, విశ్వకర్మచే నిర్మింపబడిన ద్వారకాపట్టణానికి శ్రీకృష్ణుడు తన యోగమహిమతో మథురానగర ప్రజలు అందరినీ తరలించి బలరాముడికి తెలియజేసాడు. ఆయన అంగీకారంతో నందనవనం నుంచి వెలువడే ఐరావత గజం వలె, మేరుపర్వత గుహ నుంచి బయలుదేరిన వీరకేసరి వలె, తూర్పు దిక్కున ఉదయించే సూర్యుని వలె మాధవుడు మథురాపురం వెలువడి, ఆయుధాలు లేకుండా కాలయవనునికి ఎదురు వెళ్ళాడు. అలా నిరాయుధుడై వస్తున్న ఆయనను కాలయవనుడు చూసి అలా వస్తున్న శ్రీకృష్ణుని చూసి, కాలయవనుడు తన వారితో ఇలా అన్నాడు “ఏనుగుల గుంపులు లేవు; గుఱ్ఱాల పౌజులు లేవు; తేరుల బారులు నడువవు; శూరులు వెంట రావటం లేదు; ధనుస్సు, బాణములు, ఖడ్గము, మొదలైన ఆయుధాలు ధరించకుండా; ఇంద్రధనస్సుతో కూడిన మేఘంవలె శోభిస్తూ; మెడలో హారం ధరించినవాడు పట్టణద్వారం నుంచి ఒంటరిగా వస్తున్న అతగాడిని చూసారా.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=196&padyam=1616

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: