Thursday, January 21, 2021

శ్రీ కృష్ణ విజయము - 128

( ద్వారకానగర నిర్మాణము )

10.1-1612-సీ.
ఆసక్తి కృష్ణముఖావలోకనమంద-
  హరిపాదసేవనమంద చింత
వెఱపు నారాయణ విముఖకార్యములంద-
  పారవశ్యము విష్ణుభక్తి యంద
బాష్పనిర్గతి చక్రిపద్య సంస్తుతులంద-
  పక్షపాతము శార్ఙ్గిభక్తులంద
లేమి గోవిందాన్య లీలాచరణమంద-
  శ్రమము గోవిందపూజనములంద
10.1-1612.1-తే.
బంధ మచ్యుతపరదుష్టపథములంద
జ్వరము మాధవవిరహితక్షణములంద
మత్సరము లీశు కైంకర్యమతములంద
నరవరోత్తమ! వినుము త న్నాగరులకు.
10.1-1613-వ.
మఱియు న ప్పురవరంబున హరికిం బారిజాతమహీజంబును సుధర్మ మనియెడి దేవసభను దేవేంద్రుం డిచ్చెఁ; గర్ణైకదేశంబుల నలుపు గలిగి మనోజవంబులును శుక్లవర్ణంబులు నైన తురంగంబుల వరుణుం డొసంగె; మత్స్య కూర్మ పద్మ మహాపద్మ శంఖ ముకుంద కచ్ఛప నీలంబు లను నెనిమిది నిధులఁ గుబేరుండు సమర్పించె; నిజాధికార సిద్ధికొఱకుఁ దక్కిన లోకపాలకులును దొల్లి తమకు భగవత్కరుణా కటాక్షవీక్షణంబుల సంభవించిన సర్వసంపదల మరల నతిభక్తితో సమర్పించిరివ్విధంబున.
10.1-1614-క.
దర్పించి చేసి పురము స
మర్పించెను విశ్వకర్మ మంగళగుణ సం
తర్పిత గహ్వరికిని గురు
దర్పిత దుఃఖప్రవాహ తరికిన్ హరికిన్.

భావము:
ఓ రాజశ్రేష్ఠుడా! పరీక్షన్మహారాజా! విను. ఆ ద్వారక లోని ప్రజలకు శ్రీకృష్ణుని వదనారవింద సందర్శనమందే అపేక్ష. ఆ గోవిందుని చరణాలు సేవించుట యందే వారు తలంపు కలిగి ఉంటారు. హరికి విరుద్ధము లైన పనులు అంటే వారు భయపడతారు. విష్ణుభక్తి యందే వారికి మైమరపు కలుగుతుంది. చక్రధరుని మీద పద్యాలల్లి ప్రస్తుతించే టప్పుడు వారికి ఆనందబాష్పాలు కారుతాయి. విష్ణుభక్తులు అంటేనే వారికి అభిమానం ఎక్కువ. అచ్యుతుని కంటే అన్యములైన లీలలను ఆచరించుట విషయంలో వారికి ఉన్నది లేమిడి. పురుషోత్తముని పూజించుట కోసమే వారు ఎక్కువ శ్రమిస్తారు. శ్రీహరిని పొందించని కుమార్గములే వారికి చెఱలు. క్షణకాలం పద్మనేత్రుని విడిచితే వారు పరితపించిపోతారు. పరమేశ్వరుని కైంకర్యములు విషయంలో వారికి పట్టుదల ఎక్కువ. మఱియు శ్రేష్ఠమగు ఆ పట్టణంలో నివసించే కృష్ణుడికి పారిజాతవృక్షమును, సుధర్మ అనే దేవసభను దేవేంద్రుడు ఇచ్చాడు. ఒక చెవి మాత్రమే నలుపురంగు తక్కిన శరీరం అంతా తెల్లటి రంగు కలిగి మనోవేగం కలిగిన గుఱ్ఱాలను వరుణుడు ఇచ్చాడు. వరము తప్పించి నవనిధులలోని మత్స్యం, కూర్మం, పద్మం, మహాపద్మం, శంఖం, ముకుందం, కచ్ఛపం, నీలం, అనే పేర్లు కల ఎనిమిది నిధులను కుబేరుడు సమర్పించాడు. తక్కిన లోకపాలురు అందరూ తమతమ అధికారాల సిద్ధి కోసం మునుపు తమకు భగవంతుని అనుగ్రహం వలన లభించిన సకల విభూతులను మరల అచ్యుతునికే మిక్కిలి భక్తితో సమర్పించుకున్నారు. ఆ విధముగా, విశ్వకర్మ మిక్కిలి ఉత్సాహంతో నైపుణ్యంతో పట్టణం నిర్మించి; కల్యాణగుణాలు కూడిన భూదేవి భర్త, మహా విజృంభణం కలిగిన దుఃఖమనే ప్రవాహాన్ని దాటడానికి నావ, సకల పాపాలు హరించువాడూ అయిన శ్రీకృష్ణుడికి సమర్పించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=195&padyam=1612

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: