Saturday, January 2, 2021

శ్రీ కృష్ణ విజయము - 113

( గోపస్త్రీలకడకుద్ధవుని బంపుట )

10.1-1436-క.
సిద్ధవిచారు గభీరున్
వృద్ధవచోవర్ణనీయు వృష్ణిప్రవరున్
బుద్ధినిధి నమరగురుసము
నుద్ధవునిం జూచి కృష్ణుఁ డొయ్యనఁ బలికెన్.
10.1-1437-శా.
"రమ్మా యుద్ధవ! గోపకామినులు నా రాకల్ నిరీక్షంచుచున్
సమ్మోహంబున నన్నియున్ మఱచి యే చందంబునం గుందిరో
తమ్మున్ నమ్మినవారి డిగ్గవిడువన్ ధర్మంబు గాదండ్రు; వే
పొమ్మా; ప్రాణము లే క్రియన్ నిలిపిరో ప్రోద్యద్వియోగాగ్నులన్.
10.1-1438-క.
"లౌకిక మొల్లక న న్నా
లోకించు ప్రపన్నులకును లోఁబడి కరుణా
లోకనములఁ బోషింతును
నా కాశ్రితరక్షణములు నైసర్గికముల్.

భావము:
ఫలవంత మైన భావాలు కలవాడు, గంభీరుడు, పెద్దలు మెచ్చదగిన వాడు, వృష్ణివంశోత్తముడు, గొప్ప తెలివి కలవాడు, దేవతల గురువైన బృహస్పతితో సమానుడు అయిన ఉద్ధవుడిని పిలచి, మెల్లగా ఇలా చెప్పాడు. “ఉద్ధవా! ఇలా రా! గోపికలు ప్రణయమూర్తులు. నా ఆగమనానికి ఎదురుచూస్తూ, నా మీది వ్యామోహంతో అన్నీ మరచిపోయి ఎంతగానో దుఃఖపడుతూ ఉంటారు. నమ్ముకున్న తమను విడవడం ధర్మం కాదని పెద్దలుఅంటూ ఉంటారు. వేగంగా వెళ్ళు. పెచ్చుమీరుతున్న వియోగమనే అగ్నిజ్వాలలతో వారెలా ప్రాణాలు నిలబెట్టుకుంటూ ఉన్నారో? లోకధర్మాలు అన్నీ విడచిపెట్టి నా మీదనే చూపు నిలిపి, భక్తి ప్రపత్తులు సలిపేవారికి నేను లోబడి, వారిని దయతో చూస్తూ కాపాడుతాను. ఆశ్రితులను ఆదుకోవడం నాకు స్వభావసిద్ధమైన గుణం.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=172&padyam=1438

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: