Sunday, January 17, 2021

శ్రీ కృష్ణ విజయము - 119

( కాలయవనునికి నారదుని బోధ )

10.1-1582-మ.
"యవనా! నీవు సమస్త భూపతుల బాహాఖర్వగర్వోన్నతిం
బవనుం డభ్రములన్ హరించు పగిదిన్ భంజించియున్నేల యా
దవులన్ గెల్వవు? వారలన్ మఱచియో దర్పంబు లేకుండియో?
యవివేకస్థితి నొందియో? వెఱచియో? హైన్యంబునం జెందియో?
10.1-1583-క.
యాదవులలోన నొక్కఁడు
మేదినిపై సత్వరేఖ మెఱసి జరాసం
ధాదులఁ దూలం దోలెనుఁ
దాదృశుఁ డిలలేడు వినవె తత్కర్మంబుల్."
10.1-1584-వ.
అనిన విని, కాలయవనుం డిట్లనియె.

భావము:
“ఓ కాలయవనా! వాయువు మేఘములను ఎగురగొట్టునట్లు, నీవు భుజగర్వాతిశయంతో రాజులను అందరిని గెలిచావు కాని, ఎందుకు ఇంకా యాదవులను జయించ లేదు. వాళ్ళను మరచిపోయావా, గర్వములేకనా, తెలియకనా, భయమా లేక అల్పత్వమా ?యాదవులలో ఒకడు బలాధిక్యంతో భూమ్మీద తేజరిల్లుతూ జరాసంధుడూ మొదలైనవారిని తరిమేసాడు. అంతటి వాడు ఈ భూలోకంలోనే మరొకడు లేడు. అతను చేసిన ఘనకార్యములు నీవు వినలేదా?” అలా చెప్పిన నారదుని మాటలు వినిన కాలయవనుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=193&padyam=1583

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: