Sunday, November 18, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 50

10.1-529-వ.
ఇట్లు విజ్ఞానదష్టిం జూచి యెఱింగియు నమ్మక బలదేవుండు గొందలపడుచుఁ గృష్ణుం జూచి “మహాత్మా! తొల్లి యెల్ల క్రేపులును ఋషుల యంశం బనియును గోపాలకులు వేల్పుల యంశం బనియును దోఁచుచుండు; నిపుడు వత్సబాలకసందోహంబు సందేహంబు లేక నీవ యని తోఁచుచున్నది; యిది యేమి?” యని యడిగిన యన్నకు నున్నరూపంబు వెన్నుండు మన్ననఁ జేసి క్రన్నన నెఱింగించె నతండు నెఱింగె; యివ్వింధంబున హరి బాల వత్సంబులు దాన యై సంచరించిన యేఁడు విరించికిఁ దన మానంబున నొక్క త్రుటిమాత్రం బైన విరించి చనుదెంచి వత్సబాలకాకారుండైన కృష్ణబాలకుం జూచి వెఱంగుపడి యిట్లని వితర్కించె.


భావము:
ఇలా యోగదృష్టితో చూసినప్పటికీ బలరాముడు నమ్మలేక కంగారుపడ్డాడు. కృష్ణుని ఇలా అడిగాడు. “మహాత్మా! ఇంతకు ముందు వరకూ లేగదూడలన్నీ ఋషుల అంశలతో జన్మించినవి అనీ, గోపాలకులు అందరూ దేవతల అంశలు అనీ నాకు అనిపిస్తూ ఉండేది. ఇప్పుడు చూస్తే లేగలూ బాలకులూ అందరూ నిస్సందేహంగా నీవే అని నాకు అనిపిస్తున్నది, కనిపిస్తున్నది ఈ వింత ఏమిటి” ఇలా అడగ్గానే కృష్ణుడు అన్నగారి యెడల అనుగ్రహంతో ఉన్న రహస్యం విప్పి చెప్పాడు. బలరాముడు గ్రహించాడు. ఈవిధంగా శ్రీహరి బాలురు లేగలు తానే అయి చరించినది ఒక ఏడాది. ఆ కాలం బ్రహ్మదేవునికి తన కాలమానం ప్రకారం ఒక్క తృటి కాలంగా కనిపించింది. అతడు వచ్చి దూడల రూపంలోనూ, బాలకుల రూపంలోనూ కనిపిస్తున్న బాలకృష్ణుని చూసి నివ్వెరపోయి ఇలా ఆలోచించుకున్నాడు.



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




No comments: