Sunday, November 4, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 38

10.1-507-శా.
బాలుం డయ్యు నితం డఘాసురుఁడు ద్రుంపన్బాలురం గ్రేపులన్
యేలీలన్ బ్రతికించెనొక్కొ? భువి నూహింపం గడుం జోద్య మం
చాలో నంబుజసంభవుండు చని మాయా బాలు శుంభద్బలం
బాలోకింపఁ దలంచి డాఁచె నొకచో నా లేఁగలన్ బాలురన్.
10.1-508-వ.
ఆ సమయంబున, దూడలు పోయిన జాడ యెఱుంగక, తప్పి య ప్పద్మలోచనుం డెప్పటి కొలంకుకడకు వచ్చి, యచ్చోట నె నెచ్చెలులం గానక వారిం జీరి, లేకుండుట నిశ్చయించి గోవిందుండు విశ్వవిదుండు గావున నిది విరించి మొఱంగని యెఱింగి తిరిగి పోవుచు.

భావము:
అలా కృష్ణుడు పశువులను వెతుకుతుంటే, భూమికి దిగి వచ్చిన బ్రహ్మదేవుడు ఇలా అనుకున్నాడు. “ఇతడు పసిబాలుడు కదా! అఘాసురుడు మ్రింగిన గోపబాలురను లేగలను ఎలా రక్షించగలిగాడు? ఇది ఈ భూలోకం లోనే చాలా ఆశ్చర్యకరమైన విషయమే. ఈ మాయబాలకుడి మహాశక్తి ఎలాంటిదో పరీక్షించి చూద్దాం” అనుకున్నాడు. బ్రహ్మయ్య ఇటు అడవిలోని లేగలను, అటు భోజనాలు చేస్తున్న బాలురనూ ఒక రహస్య ప్రదేశంలో దాచాడు.
అప్పుడు కృష్ణుడు దూడలజాడలు కనపడక తిరిగి కొలను వద్దకు వచ్చాడు. అక్కడ గోపబాలురు కూడా కనిపించలేదు. వారిని పిలిచి వారు ఇక్కడ లేరని నిర్ధారించు కున్నాడు. కృష్ణుడు విశ్వంలోని రహస్యాలన్నీ ఎరిగిన వాడు కదా. ఇది బ్రహ్మదేవుడి మోసం అని గ్రహించాడు. వెంటనే గిరుక్కున వెనుదిరిగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=70&padyam=507

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: