Monday, September 27, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౫౦(350)

( జరాసంధుని వధింపఁబోవుట) 

10.2-726-వ.
అనిన విని జరాసంధుండు వారల రూపంబులును, మేఘగంభీర భాషణంబులును, గుణకిణాంకంబులును మహాప్రభావంబులునుం జూచి తన మనంబున “వీరలు బ్రాహ్మణవేషధారులైన రాజేంద్రులు గానోపుదు” రని తలంచి “యిమ్మహాత్ములు గోరిన పదార్థంబ కాదు; ప్రాణంబులేనియు నిత్తు; నదియునుం గాక తొల్లి బలీంద్రుండు విప్రవ్యాజంబున నడిగిన విష్ణుదేవునకు నాత్మపదభ్రష్టత్వం బెఱింగియు విచారింపక జగత్త్రయంబు నిచ్చి కీర్తిపరుండయ్యె; క్షత్రబంధుం డనువాఁడు బ్రాహ్మణార్థంబు నిజప్రాణపరిత్యాగంబు సేసి నిర్మలంబగు యశంబు వడసె; నది గావున ననిత్యంబైన కాయంబు విచారణీయంబు గాదు; కీర్తి వడయుట లెస్స” యని తలంచి యుదారుండై కృష్ణార్జునభీములం గని యిట్లనియె. 

భావము:
ఈ మాదిరి పలుకుతున్న వారి పలుకులు వినిన జరాసంధుడు వారి స్వరూపాలనూ, గంభీరమైన కంఠాలనూ, అల్లెత్రాటి వలన భుజాలమీద ఏర్పడ్డ గుర్తుల్ని గమనించి, “వీరు బ్రాహ్మణ వేషం ధరించిన రాజశేఖరులు కావచ్చు. ఈ మహాత్ములు వస్తువునే కాదు ప్రాణాలుతో సహా ఏది కోరినా ఇచ్చేస్తాను. అంతేకాదు, పూర్వం బలిచక్రవర్తి బ్రాహ్మణ వేషంతో యాచించిన విష్ణుదేవుడికి తన పదవి పోతుందని తెలిసినా, ఏమాత్రం లెక్కచెయ్యకుండా ముల్లోకాలను దానం చేసి శాశ్వత యశస్సును పొందాడు. క్షత్రబంధుడు అనే పేరు గలవాడు బ్రాహ్మణుల కోసం తన ప్రాణాన్నే త్యాగంచేసి నిర్మలమైన కీర్తిని పొందాడు. అశాశ్వతమైన శరీరాన్ని గురించి ఆలోచించనక్కర లేదు. కీర్తిని పొందటమే ఉచితం” అని ఆలోచించుకొని, కృష్ణార్జునభీములతో ఇలా అన్నాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=55&Padyam=726 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: